సూర్యాపేట : వరి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటల సాగుతో రైతులు భారీ లాభాలు పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్, మెర్సకుంట తండా, మేఖ్యా తండాలలో పలు శుభకార్యాలకు హాజరైన మంత్రి అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు.
ఈ క్రమంలో ప్రస్తుత వానకాలంలో ఏ పంటలు వేస్తున్నారని రైతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వరి పంట వల్ల కలిగే లాభ నష్టాలను..అదే విధంగా వాణిజ్య, కూరగాయల పంటలు సాగు చేస్తే కలిగే ఉపయోగాలను మంత్రి వివరించారు.
ఎప్పుడూ వరి వేసి భూమిని పాడుచేసుకోవద్దని, చివరి దశలో వచ్చే తెగుళ్ల ద్వారా రైతులు తీవ్రంగా నష్టోతున్నారన్నారు. అదే పంట మార్పిడి పద్ధతితో మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు.
రైతులు తమకున్న వ్యవసాయ భూముల లో ఒక్క పంటను మాత్రమే సాగు చేయకుండా, మినుము, పెసర, కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేయడం ద్వారా ఒక పంటలో నష్టం వచ్చినా మరొక పంటలో లాభం పొందవచ్చన్నారు.
మంత్రి వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, మల్కాపురం సర్పంచ్ రామకృష్ణా రెడ్డి, లోకేష్ నాయక్, చేదెళ్ల సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.