తడిగుడ్డతో గొంతు కోయడం!
నమ్మించి, నట్టేట నిలువునా ముంచడం!
అశలు రేపి, అమాంతం చిదిమేయడం!
అదును చూసి అగాధంలోకి పడదోయడం!
పచ్చని కలలపై పగ సాధించడం!
వెచ్చని కత్తిని వెన్నులో దించడం!
తెలంగాణ సర్కారు చర్యను ఏ పేరుతోనైనా పిలవండి..
బీసీలకు చేసిన మోసాన్ని ఏ పదాలతోనైనా కొలవండి..
నమ్మి ఓట్లేసిన బీసీ బిడ్డలకు కాంగ్రెస్ ధోకా నిజం..
నడిమిట్ల కాడి పారేసి, కోటాను కాటగలిపిందీ నిజం!
ఇది నయవంచన! ఇది నయా వంచన!
తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ సర్కారు మళ్లీ మోసం చేసింది. ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్పై విషపు నవ్వులతో వికృత రాజకీయమాడింది. బీహార్ ఎన్నికల కోసం నాటకం మొదలు పెట్టి.. మధ్యలోనే తెరదించింది. బీసీ కోటాను చూపించి బీహార్లో ఓట్లను కొల్లగొట్టాలన్న యావే తప్ప.. చట్టబద్ధతతో దాన్ని సాధించి తెలంగాణబిడ్డలకు న్యాయంచేసే చిత్తశుద్ధేది?
రిజర్వేషన్లు 50శాతం దాటకుండా సుప్రీంకోర్టు పరిమితి ఉన్నదని తెలుసు. అనేక రాష్ర్టాలు చేతులు కాల్చుకున్నాయనీ తెలుసు.. కేంద్రం వద్ద బిల్లు క్లియర్ కాదనీ తెలుసు. సుప్రీం తన తీర్పుకు తానే వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోదనీ తెలుసు. అయినా 42 శాతం బీసీ బిల్లు పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడింది. రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ తీర్మానంతో కోటా రాదని.. విపక్షాలు, బీసీ విద్యావంతులు మొత్తుకుంటున్నా వినకుండా ఎన్నికల నోటిఫికేషన్ దాకా తెచ్చి చివరకు కోర్టు ముందు చేతులెత్తేసింది. చెల్లని జీవోతో చిల్లర రాజకీయానికి పాల్పడిందని ఇప్పుడు తేటతెల్లమైంది.
నమ్మకద్రోహానికి.. విశ్వాసఘాతుకానికి.. పాల్పడిన రేవంత్ ప్రభుత్వం ఇపుడు బీసీలను దగా చేసిన సర్కారుగా సమాజం ముందు నిలబడింది. అవగాహన రాహిత్యంతో అసమర్థ సర్కారుగా తనకు తానే ప్రకటించుకున్నది.
రాష్ర్టాలకు రిజర్వేషన్ల్ల అధికారం ఇవ్వడమనేది నేరం. అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. ఎన్నో డిబేట్లు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన తరువాత నిర్ధారించినవి ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలలకొద్దీ డిబేట్ జరిగిన తరువాత రచించిన రాజ్యాంగమిది.
-గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్
బీసీ కోటాకు రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్గాంధీ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏనాడూ పార్లమెంట్లో ప్రస్తావించలేదు. కానీ బీహార్లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ దీన్ని వాడుకున్నది. 42 శాతం బీసీ కోటా అంశం కోర్టుల్లో నిలువదని తెలిసినా ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చింది. షెడ్యూల్ 9లో చేర్చితేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా మోసపూరిత డ్రామాలను రక్తికట్టించింది.
-మధుసూదనాచారి, మండలిలో ప్రతిపక్షనేత
హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో-9 చెల్లదని సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) తెలుసు. 42 శాతం రిజర్వేషన్ల జీవోకు చట్టబద్ధత ఉండదని మంత్రులకు, సీఎంవోలోని అధికారులకు, ప్రభుత్వ సలహాదారులకు ముందే తెలుసు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో 50 శాతం పరిమితి దాటుతున్నదని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని కూడా ప్రభుత్వ పెద్దలకు తెలుసు. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేసే అధికారం రాష్ట్ర క్యాబినెట్కు లేదని వారందరికీ తెలుసు. రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించరని తెలుసు. ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగా, అదే అంశం మీద ప్రభుత్వం విడుదల చేసే ప్రత్యేక ఉత్తర్వులు చెల్లవని కూడా తెలుసు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రమేయం లేకుండా పార్లమెంటులో బిల్లులకు ఆమోదం అసాధ్యమని తెలుసు. అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీను మోసం చేస్తూ వచ్చింది. దాదాపు 14 నెలలుగా రిజర్వేషన్ల పెంపు మీద డ్రామాలు ఆడుతూ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని ఒకసారి.. ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని మరోసారి.. పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తామని ఇంకోసారి చెప్తూ వచ్చింది. చివరికి, ఎక్కడి బిల్లులు అక్కడ పెండింగ్లో ఉండగా ప్రత్యేక జీవో ఇచ్చి బీసీలను నిట్టనిలువునా మోసం చేసింది.
ప్రభుత్వం వేసిన ప్రతి అడుగులోనూ మోసమే ఉందంటూ బీసీ ప్రజల స్వరమై ‘నమస్తే తెలంగాణ’ పదుల సంఖ్యలో కథనాలు ప్రచురించింది. బీసీలను రేవంత్రెడ్డి నమ్మించి మోసం చేస్తున్నారని ఆధారాలతో సహా ప్రజల ముందుంచింది. మూడు దశాబ్దాల కిందట సుప్రీంకోర్టు అమల్లోకి తీసుకువచ్చిన రిజర్వేషన్ సీలింగ్ను సడలించే రాజ్యాంగ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని నిపుణుల అభిప్రాయాలతో ‘నమస్తే’ కథనాలు ప్రచురించింది. ప్రభుత్వం ఇచ్చే జీవో న్యాయ సమీక్ష ముందు నిలబడదని న్యాయ నిపుణులు అందులో అభిప్రాయపడ్డారు.
ఈ కథనాలపై కాంగ్రెస్ పెద్దలు గుస్సా అయ్యారు. అంతేతప్ప, బీసీలను మోసం చేసే ఎత్తుగడలను మాత్రం మానుకోలేదు. చివరికి గురువారం ప్రభుత్వం చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. బీసీలకు చేసిన మోసం మీద సమీక్షించుకోకుండా మళ్లీ మళ్లీ బీసీలను ఏమార్చే ప్రయత్నాలు చేస్త్నుది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు సాధిస్తామని బీరాలు పలుకుతున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
విద్య, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంల్లో 2 వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ కార్యదర్శి ఈ బిల్లులను గవర్నర్కు పంపగా గవర్నర్ వాటిని ఆమోదించకుండానే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం రెండు బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను అంత సులువుగా ఆమోదించడం కష్టమే. పైగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘బీసీ బిల్లు’లను తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా వీలు దొరికినప్పుడల్లా ‘అవును.. అవును’ అంటూ ఢంకా బజాయించి చెప్పుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆ బిల్లులను ఆమోదించడం కష్టం కాబట్టి రేవంత్రెడ్డి ఢిల్లీలో మంత్రాంగం చేయాల్సింది. కానీ ఢిల్లీలో ధర్నా డ్రామా మినహాయించి పార్లమెంటులో బిల్లుల ఆమోదం కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. 54 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన రేవంత్రెడ్డి కనీసం ఒక్కసారైనా ప్రధాని మోదీని, ఇతర మంత్రులను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించండి అని కోరలేదు. బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతిని కలిసే ప్రయత్నమే చేయలేదు. కనీసం ఇండియా కూటమి నేతల ద్వారా పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లపై ప్రశ్నించలేదు.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి చేయలేదు. వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల పెంపులో ముస్లింలను చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి చేతులు దులుపుకొన్నారని, ఆమోదానికి చేపట్టాల్సిన న్యాయపరమైన ప్రక్రియను ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్రం పంపిన బిల్లులను కేంద్రం ఆమోదించి 9వ షెడ్యూల్డ్ చేర్చేలా ఒక్క ప్రయత్నం కూడా చేయలేదని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
50 శాతం రిజర్వేషన్ల కోటా పరిమితిని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో-9ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి జీవోతో స్థానిక సంస్థల ఎన్నికల జరిగాయా? అని ఆరాతీస్తే ఎక్కడా సొంత జీవోలతో కోటా పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేసి, ఎన్నికలు నిర్వహించిన ఉందంతాలు కనిపించలేదు. నాలుగేండ్ల కింద మహారాష్ట్ర ప్రభుత్వం 50 రిజర్వేషన్ కోటా దాటి స్థానిక ఎన్నికలకు వెళ్లగా, పోలింగ్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసింది. దీంతో ఇప్పటివరకు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. కోటా పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేసిన 8 రాష్ర్టాల్ల్లోనూ నోటిఫికేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.
మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని, తీసుకున్నా అవి రాజ్యాంగ పరంగా, న్యాయపరంగా చెల్లుబాటు కావని అందరికీ తెలుసు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ను అసెంబ్లీలో పెట్టి, గవర్నర్కు పంపి కొన్ని రోజులు నాటకం ఆడింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తూ జీవో 9 ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ప్రక్రియను హైకోర్టు తప్పుబట్టింది. 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ మీద స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
సీఎం రేవంత్రెడ్డికి బీసీల మీద గౌరవం, అభిమానం ఉంటే చేతిలో ఉన్న పదవులు ఎందుకు కేటాయించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి వర్గంలో ఇప్పటికీ రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయని, వాటిని బీసీలతో నింపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 72 ఏండ్ల ఉమ్మడి/ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా బుర్రా వెంకటేశంగౌడ్ అనే బీసీ ఐఏఎస్ అధికారికి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం వచ్చిందని, కానీ ఆయనను సర్వీస్ నుంచి ఎందుకు తప్పించారని బీసీలు ప్రశ్నిస్తున్నారు.
‘అతి సామాన్య బీసీ కుటుంబం నుంచి ఎదిగిన బుర్రాం వెంకటేశంను సీఎస్గా నియమించి ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపుపై మనసు పెట్టి పోరాటం చేస్తున్నారని నమ్మేవాళ్లమని అంటున్నారు. ఇటీవలే ఆరుగురిని ఐఆర్టీ కమిషనర్లుగా నియమించిన రేవంత్రెడ్డి, ఒక్క బీసీకి కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఇవే కాదని ప్రభుత్వంలోని కీలక పదవులు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. కీలక పోస్టులో అగ్రకుల నేతలకే అవకాశం ఇచ్చారని చెప్తున్నారు.
కీలకమై పదవులు ఇవ్వకుండా ‘తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి’ అన్నట్టు పేరుకే 42 శాతం రిజర్వేషన్లు కల్పించారని మండిపడుతున్నారు. బీసీ కులగణన క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా బీసీని కాకుండా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని నియమించినప్పుడే బీసీలకు న్యాయం దక్కుతుందనే ఆశలు కోల్పోయామని అంటున్నారు. ఒకవేళ సీఎంకు నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే రాజ్యాంగ పరమైన చిక్కులు, న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను పట్టుకొని సాగదీయటం కంటే, పెద్ద పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.