న్యూఢిల్లీ, మే 21 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ 3.0 పాలన ఈ ఏడాది జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో, భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ భారీగా మార్పులు ఉంటాయని సమాచారం. అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్రావు బుధవారమే ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ అయ్యారని, రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారని తెలిసింది. గురువారం కూడా అందుబాటులో ఉండాలన్న ఆదేశాల మేరకు ఆయన అక్కడే ఉండిపోయారు. గురువారం మోదీ అధ్యక్షతన జరిగిన సంపూర్ణ క్యాబినెట్ సమావేశం అనంతరం బీజేపీ పెద్దలు మరోసారి రాంచందర్రావుతో సమావేశమైనట్టు తెలిసింది.
కేంద్ర క్యాబినెట్లో 81 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 72 మంది సభ్యులు ఉండగా, మరో 9 మందిని తీసుకోవచ్చు. 2027లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, 2029లో జరుగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ కంటే పునర్వ్యవస్థీకరణ చేయడమే మేలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు కూడా ప్రాధాన్యం కల్పించాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మంత్రుల పనితీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన పలుకాలని భావిస్తున్నారని సమాచారం.
రాష్ట్రంలోనూ భారీ మార్పులు
రాష్ట్రంలోనూ భారీగా మార్పులు చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని రాష్ర్టానికి మరో బెర్త్ కేటాయించాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. బండి భగీరథ్ వ్యవహారం నేపథ్యంలో బండి సంజయ్పై వేటు పడే అవకాశం ఉన్నదని సమాచారం. బండి సంజయ్ని పార్టీ సేవలకు వినియోగించాలని మొదట భావించినా, ఆయనకు గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని, ప్రజలు నమ్మడం లేదని, ఆయనకు పదవి ఇస్తే పార్టీపై పోక్సో కేసు ప్రభావం పడుతుందని కొందరు నేతలు చెప్పడంతో ఆలోచనలో పడ్డట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నిర్భయ కేసు వ్యవహారం కూడా ఒక ముఖ్య కారణమనే విషయాన్ని మరచిపోవద్దని అగ్రనేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది.
దీంతో బండికి ఉద్వాసన పలుకడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన స్థానంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరో బెర్త్ కోసం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. కిషన్రెడ్డిని కూడా మంత్రి పదవి నుంచి తప్పించి, రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరింత బలోపేతం అవుతుందని మొదట ఆలోచన చేసినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. అయితే, ఒకేసారి ఇద్దరు మంత్రులను తొలగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నదని, కాబట్టి కిషన్రెడ్డిని కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్తున్నారు. అయితే, కిషన్రెడ్డి శాఖ మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. డీకే అరుణకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం.