సిద్దిపేట : తెలంగాణలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల ( Maize ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని అన్నారు. షాపుల్లో ఇవ్వాల్సిన యూరియా యాపుల్లో ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ సర్కార్ విఫలమయ్యిందని అన్నారు. కోతల దశకు వచ్చినా పంట పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితికి చేరిందని పేర్కొన్నారు.
కనీసం పండించిన పంటైనా అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ అదే నిర్లక్ష్యం, వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో మక్క సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని అన్నారు. అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అసలు ఏర్పాటు చేయక పోవడం, చెల్లింపులు ఆలస్యం కావడం, రవాణా సదుపాయాల లేమి వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయని హరీష్రావు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.