Mynampally Hanumantha Rao | హైదరాబాద్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను వీడి కుమారుడు రోహిత్తో కలిసి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆయన రాకను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పడంతో ఏం జరుగుతున్నదో అర్థంకాక మైనంపల్లి తల పట్టుకున్నారు. మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ను వీడగా.. సోమవారం మల్కాజిగిరి డీసీసీ చీఫ్ నందికంటి శ్రీధర్ పార్టీకి బైబై చెప్పేశారు. మరోవైపు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు జే వెంకట్రెడ్డి కూడా పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ పరిణామాన్ని ఊహించని పార్టీతోపాటు మైనంపల్లి కూడా నివ్వెరపోతున్నారు. మైనంపల్లి చేరికను తిరుపతిరెడ్డి, శ్రీధర్ ఇద్దరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా అధిష్ఠానం గుడ్డిగా ముందుకెళ్లడంతో వారిద్దరూ రాజీనామా చేశారు. వీరిని బుజ్జగించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్ శ్రీధర్ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలే దు. ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పార్టీ ని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
మైనంపల్లి చేరికతో నిన్నమొన్నటి వరకు ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నీరుగారిపోయింది. ఆయన చేరికతో కాంగ్రెస్ బలపడుతుందనుకుంటే బలహీనపడుతుండడం పార్టీకి మింగుడుపడడం లేదు. ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడం, మరికొందరు అదే బాటలో ఉన్నట్టు తెలియడంతో పార్టీలో ఆందోళన వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి తనకు తానుగా దెబ్బతినడంతోపాటు ఇప్పుడు పార్టీని కూడా దెబ్బతీశారన్న అభిప్రాయం నెలకొంది. ఇటు మల్కాజిగిరి, అటు మెదక్లో పార్టీకి ఉన్న బలం పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీకి ఆయన గుదిబండలా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా కొందరు నేతలు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.
పంతంతో బీఆర్ఎస్ను వీడిన మైనంపల్లికి కాంగ్రెస్లో చేరడంతోనే సంతోషం ఆవిరైంది. తాను పార్టీలో అడుగు పెట్టగానే ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీ వీడటంపై మనస్తాపం చెందిన ట్టు తెలిసింది. ఈ ఊహించని పరిణామాలు త మ పోటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ తనతో కలిసి రాకపోవడం, కాంగ్రెస్ క్యాడర్ నడిచేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, అలాంటప్పుడు ఆయనతో కలిసి వెళ్లడం వల్ల దండగన్న చర్చ క్యాడర్లో జరుగుతున్నది.