హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. బుధవారం డీజీపీతోపాటు ఇతర ఉన్నతాధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సీసీటీవీల ఏర్పాటులో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నదని వివరించారు. మరిన్ని కాలనీలు, బస్తీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని చెప్పారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించాలని, ఫేక్ వీడియోలు, సందేశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి జితేందర్, డీజీపీ అంజనీకుమార్, సీపీలు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.