మానకొండూర్/హుస్నాబాద్, నవంబర్ 23: కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా మానకొండూర్లో మీడియాతో మాట్లాడారు. అనంతరం గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. 2014కు ముందు ముస్లింలను పట్టించుకున్నవారే లేరని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటున్నారని తెలిపారు. బడ్జెట్లో ముస్లిం మైనార్టీలకుప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ముస్లిం పిల్లలు చదువుకునే అవకాశం లేక హోటళ్లలో పనిచేసేవారని, సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
షాదీముబారక్ పథకం పేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతున్నదని, విదేశాలకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు ఓవర్సీస్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. ముస్లింల రిజర్వేషన్ కోసం జీవో జారీ చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మతఘర్షణలు జరిగేవని తరచూ కర్ఫ్యూలు విధించే పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో మతఘర్షణలు, కర్ఫ్యూలు మచ్చుకైనా లేవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఆదరించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.