హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్లోని మంత్రుల శాఖలన్నింటినీ మార్చాలని తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ.. క్యాబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తానూ చేయాల్సింది, సూచించాల్సింది అంతవరకేనని పేర్కొన్నారు. మిగిలిన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
క్యాబినెట్ విస్తరణ లేదా శాఖల కేటాయింపు అనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని అంశమని చెప్పారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని పూర్తిగా అధిష్ఠానానికే వదిలేశామని అన్నారు. ప్రస్తుతం తనకు పార్టీని నడిపించే అత్యంత బాధ్యతాయుతమైన పీసీసీ అధ్యక్ష పదవి ఉన్నదని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని, అది కాంగ్రెస్లోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.