హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఖండించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్, హరీశ్రావు సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులతో అడ్డుకోవడం, కేసులు బనాయించడం, అసెంబ్లీలో సస్పెన్షన్లకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్ష గొం తును బెదిరింపులు, అరెస్టులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి ఉద్రిక్తతలు సృష్టించడం గర్హనీయమని, ఇది రాష్ట్ర రాజకీయ సంస్కృతికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.