హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు. అమెరికా న్యూజెర్సీలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ వంటి ఖలేజా ఉన్న నేత దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శమని, తెలంగాణ మాడల్ తమకూ కావాలని వివిధ రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం దేశానికే తలమానికంగా నిలిచిందని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాష్ర్టాల ఎన్నారైలను ఏకం చేస్తామని, దేశంలో బీఆర్ఎస్ బలోపేతానికి తమవంతుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ యూఎస్ఏ నేతలు శ్రీనివాస్ జక్కిరెడ్డి (న్యూజెర్సీ అండ్ న్యూయార్క్), భాస్కర్ పిన్న (డెలావేర్) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీశైలం గదాసు, కిరణ్ తోట, శ్రీనివాస్ మేలి, ప్రశాంత్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.