మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడి ఫ్లెక్సీలు కాంగ్రెస్లో కలకలం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెం బ్లీ సెగ్మెంట్లలో ‘తిరుపతన్న మిత్రమండలి’ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. రేవంత్రెడ్డి ప్రాతి నిథ్యం వహిస్తున్న కొడంగల్ మినహా షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
సీఎం రేవంత్ ఫొటో లేకుండా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఫ్లెక్సీలను రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో వీటిని తిరుపతిరెడ్డి ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరిట గత నెల 31 నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సోదరుడి ఫ్లెక్సీలు వెలియడంతో వంశీచంద్ ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సీఎంవో అధికారులు సంబంధిత మున్సిపాలిటీలకు ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో మున్సిపల్ సిబ్బంది తిరుపతిరెడ్డి ఫ్లెక్సీలను తొలగించారు.