హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గౌరవప్రదమైన స్థానంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బలహీనవర్గాల కోసం అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపెట్టకుండా బలహీనవర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర రాజధానిలో స్థలం, భవన నిర్మాణాలకు అవసరమైన నిధులను ఇచ్చిందన్నారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని ఈ సందర్భంగా బీసీల కోసం అనేక కార్యక్రమాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను తప్పకుండా అభినందిస్తామని తెలిపారు. బీసీల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చాలా అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవమిచ్చి, మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం చేసిన ప్రతిపాదనను వెంటనే మంత్రి కేటీఆర్ అంగీకరించారు. జ్యోతిబాపూలే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతోపాటు బీసీ సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధి కోసం ఇచ్చిన మరికొన్ని సలహాలు, సూచనల పైన మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.