సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రం సాధించి సీఎం కేసీఆర్ అయ్యాకనే గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
బుధవారం పుల్లూరు జిల్లాలోని గ్రామంలో రూ. 4 కోట్ల 30 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తానూ ఎమ్మెల్యే గా గెలిచిన తొలినాళ్లలో పుల్లూరు గ్రామం సరైన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవన్నారు.
స్వరాష్ట్రంలో రోడ్డు నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పుల్లూరుకు తాగునీటి వసతి, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. దశల వారీగా ఈ మేజర్ గ్రామ పంచాయితీని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దు కున్నామని పేర్కొన్నారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు ఎస్సీ కాలనీ నుంచి రామంచ వరకు తారు రోడ్డు నిర్మాణం ను త్వరలో చేపడతామని,
గ్రామంలోనీ ప్రైమరీ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లను ఆధునీకరిస్తామన్నారు. 100 డబుల్ బెడ్ రూం లు మంజూరు చేస్తామన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం ఆపని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
కరోనా, ఒమిక్రాన్ విషయంలో భయం వద్దన్నారు. అధిక ఖర్చు పెట్టుకుని ప్రైవేటు దవాఖానలకు వెళ్లి మోసపోవద్దు అని మంత్రి సూచించారు. ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా తగదన్నారు. అలాగే పుల్లూరు గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్ ను మంత్రి అభినందించారు.
అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో వేగంగా పూర్తి చేసినందుకు మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ , సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.