హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మోసాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రజలు రెండు జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 5 గ్యారెంటీల పేరిట చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది నుంచి చేస్తున్న మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా దోఖా, రైతు రుణమాఫీ పూర్తి చేయకపోవడం వంటి అనేక అంశా లు మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వల్ల కాంగ్రెస్ మోసాలపై విరివిగా ప్రచారమై అక్కడి ప్రజలు కాంగ్రెస్ను పాతాళానికి తొక్కారని వివరించారు.
జార్ఖండ్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్పై బీజేపీ పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీని చీల్చే ప్రయత్నాలను ఆ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, బీజేపీ కక్ష సాధింపు విధానాలను ప్రజలు హర్షించడం లేదని జార్ఖండ్ ఫలితాలతో స్పష్టమైందని చెప్పారు. జార్ఖండ్లో విజయం సాధించిన హేమంత్ సోరెన్కు హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు.