Harish Rao | మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు గ్యారంటీల పేరుతో మహారాష్ట్రలో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలను నమ్మలేదని స్పష్టమైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని అన్నారు.
తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్ర లో తీవ్ర ప్రభావం చూపెట్టాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండటం వల్ల కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టమని హరీశ్రావు అన్నారు.
జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్కు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. హేమంత్ సోరెన్పై బీజేపీ పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీని చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలను ప్రజలు హర్షించడం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు.