Haritha Haram | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం పథకం అద్భుతమైన కార్యక్రమమని మహారాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వేణుగోపాల్రెడ్డి ప్రశంసించారు. పచ్చదనం పెంపులో తెలంగాణ విధానం అనుసరణీయమని కొనియాడారు. హరితహారం ఫలితాలను అధ్యయనం చేయడానికి హైదరాబాద్కు వచ్చిన మహారాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. శనివారం అరణ్యభవన్లో తెలంగాణ అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది.
రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్, హెచ్ఆఫ్ఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ మహారాష్ట్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం ఫలితాలు, విజయాలపై వివరించారు. ఇప్పటిదాకా 292 కోట్ల మొకలను నాటామని, 11.44 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ పూర్తి చేశామని చెప్పారు.
12 వేల కిలో మీటర్లకుపైగా రహదారుల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామని, 12,003 నర్సరీలతోపాటు 19,742 పల్లె ప్రకృతి వనాలు, 2,077 బృహత్ ప్రకృతి వనాలు, 1022 ఎకరాల ఇరిగేషన్ భూముల్లో దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7.70 శాతం పచ్చదనం పెంచామని తెలిపారు.
2024లో కూడా 20 కోట్ల మొకలు రాష్ట్రవ్యాప్తంగా నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణలో పచ్చదనం పెంపు కార్యక్రమాలు బాగున్నాయని, రాజకీయ సంకల్పానికి తోడు అధికారుల కృషి కూడా తోడై అద్భుతమైన ఫలితాలు సాధించారని మహారాష్ట్ర ఉన్నతాధికారి వేణుగోపాల్రెడ్డి మెచ్చుకున్నారు.