లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి సూచించిండు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సాగునీరు, ప్రభుత్వమే పంట కొనుగోలు వంటి మానవీయ విధానాలను అమలు చేయాలని సర్కారుకు నివేదించిండు. ఆయనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పిలిపించుకొని దూషించి.. బెదిరించారు. దీంతో ఆ అధికారి తాను ఏమీ చేయలేక తన పదవికే రాజీనామా చేశారు. ఇదీ మహారాష్ట్రలో నెలకొన్న దుస్థితి.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టాక మక్కీకి మక్కీ తెలంగాణ మాడల్ను అమలు చేస్తాం. రెండు నెలల్లోనే మార్పులు మొదలవుతాయి. రెండేండ్లలో వెలుగు జిలుగుల మహారాష్ట్రను సాకారం చేస్తాం.
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లు, తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే మనం దేశాన్ని శాసించే స్థాయికి చేరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కదిలించొచ్చని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చి మనం నేతృత్వం వహించే రోజులు వస్తాయని చెప్పారు. సోమవారం మహారాష్ట్రలోని దక్షిణ సోలాపూర్కు చెందిన 55 మంది సర్పంచ్లు బీఆర్ఎస్లో చేరారు. వారికి తెలంగాణభవన్లో సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గూండ్నా అనే జిల్లా ఉన్నది.
అక్కడి నుంచి ఇప్పటికే అనేక మంది సిట్టింగ్ సర్పంచులు బీఆర్ఎస్లో చేరారు. మరికొందరు చేరుతున్నారు. త్వరలో జిల్లాలోని 100 శాతం సర్పంచులు బీఆర్ఎస్ వాళ్లే ఉండబోతున్నారు. తెలంగాణలో వచ్చిన మార్పే మహారాష్ట్ర మొత్తం రావాలి, మా రాష్ట్ర అభివృద్ధి వేరే పార్టీ వల్ల సాధ్యం కాదు.. అందుకే అందరం వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నామని వారు చెప్తున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టాక మక్కీకి మక్కీ తెలంగాణ మాడల్ను అమలు చేస్తాం. రెండు నెలల్లోనే మార్పులు మొదలవుతాయి. రెండేండ్లల్లో వెలుగుల జిలుగుల మహారాష్ట్రను సాకారం చేస్తాం. మూడు, నాలుగేండ్లలోనే మహారాష్ట్రలోని పట్టణాలు, పల్లెలు, గూడేలు, తండాలు అని తేడా లేకుండా ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు అందిస్తాం. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలే బాగు చేయాలి.అన్నదాతలను ప్రభుత్వాలే ఆదుకోవాలి. ప్రపంచంలో ఏ దేశమైనా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది.
కానీ మన దేశంలో అలా లేదు. రైతుల సమస్యలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. రైతు ప్రభుత్వం వస్తేనే తలరాతలు మారుతాయి. దేశంలో ధనికుడు ఇంకా సంపన్నుడు అవుతున్నాడు. పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. దానికి తగ్గట్టే ధర్మం పేరుతో, జాతి పేరుతో, పార్టీల పేరుతో మనం విడిపోతున్నాం. అందుకే రైతులు కూడా ‘మన సర్కార్ కావాలి’ అని నినదించాలి. అందుకే మేము అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్నాం. రైతులు మేల్కోనంత వరకు ఏ ప్రభుత్వం వచ్చినా లాభం ఉండదు. దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ఇది అత్యంత బాధాకరం. రైతులు ఎంత మంది మరణించినా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఇది సరికాదు. అందుకే రైతులు తమ బలాన్ని గుర్తించాలి. బీఆర్ఎస్ గెలిస్తే రైతులు, పేదలు అభివృద్ధి చెందినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పనిచేసేదే పేదలు, రైతుల కోసం. ఈ ఒక్కసారి బీఆర్ఎస్ను గెలిపించండి. గులాబీ జెండాకు జై కొట్టండి.. ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.
దరిద్రం ధనంలో కాదు.. ఆలోచనల్లో
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కానీ మహారాష్ట్ర ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన రాష్ట్రం. అయినా ఇప్పటికీ ఎందుకు ఇలా ఉన్నది. మహారాష్ట్రలో ఏం తక్కువ? కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంత అభివృద్ధి సాధ్యమైనప్పుడు ఇంత విలువైన సంపద, సహజ వనరులు ఉన్న మహారాష్ట్రలో ఎందుకు కాలేదని నాయకులను నిలదీయండి. ఇది డబ్బు సమస్య కాదు.. నాయకుల ఆలోచనల్లో సమస్య. ధన దరిద్రం కాదు.. ఆలోచనల దరిద్రం. మీ ఊళ్లోకి వెళ్లిన తర్వాత ఇదే అంశంపై చర్చ పెట్టండి. మహారాష్ట్రలో కూడా కొత్త వెలుగులు రావాల్సిందే. కర్ణాటకలో కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చింది. ఇప్పుడు మళ్లీ బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చింది. అక్కడ ఏమైనా మార్పు వచ్చిందా? వస్తుందా? మహారాష్ట్రలో పేదలకు రూ.వెయ్యి పెన్షన్ 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు. కానీ తెలంగాణలో నెలకు రూ.2,016 ఇస్తున్నాం. మహారాష్ట్రలో చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు.
తెలంగాణలో ఉన్న బీడీ కార్మిక సోదరీమణులకు రూ.2,016 ఇస్తున్నాం. టేకేదారులకు కూడా పెన్షన్ ఇస్తున్నాం. వాళ్లకు ఆదాయం తక్కువ. వాళ్లను ప్రభుత్వం ఆదుకోకుంటే ఇంకెవరు ఆదుకుంటారు? మహారాష్ట్ర గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలో చాలా ఆవేదన అనిపిస్తుంది. దేశ ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న ముంబై మహారాష్ట్రలో ఉన్నది. ముంబైతోపాటు అనేక పెద్దపెద్ద నగరాలు, పట్టణాలున్న మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితి ఎందుకున్నది? మహారాష్ట్రలో సంపదకు కొదవలేదు. కృష్ణా, గోదావరి నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి. వీటితోపాటు పెన్గంగ, వార్దా, ఘటప్రభ, పంచగంగ, మూల, ప్రవర, వెన్గంగ ఇలా లెక్కబెట్టాల్సి వస్తే దాదాపు రెండు డజన్ల నదులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇంత నీటి సంపద ఉన్నా మహారాష్ట్రలో నీటి కటకట ఎందుకున్నదన్నది ఆశ్చర్యకరమైన అంశం.
నీళ్లు సముద్రంపాలు.. రైతులు ఆత్మహత్యల పాలు
దేశ అవసరాలకు సరిపోవటమే కాకుండా రెట్టింపు స్థాయిలో నీటి వసతి ఉన్నా.. మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతున్నది. రోజుకు ఏడుగురు, 8 మంది, 10 మంది ఇలా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి? నీళ్లు సముద్రంపాలు.. రైతులు ఆత్మహత్యల పాలా? నేను మొట్టమొదటిసారి నాందేడ్లో సభలో పాల్గొనే కంటే ముందు ‘కేసీఆర్కు మహారాష్ట్రలో ఏం పని? తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణకు ఏం కావాలో చూసుకోవాలి. కానీ మహారాష్ట్రకు ఎందుకొస్తున్నట్టు? అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించిండు. అయితే అప్పుడు నేనొక్కటే మాట చెప్పిన. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో అమలు విధానాలు కావాలని అంటున్నరు. వాటిని అమలు చేస్తే ‘మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేస్తే నేను మహారాష్ట్రకు కాకుండా మధ్యప్రదేశ్కు పోతా’ అని సమాధానం చెప్పిన. ఇప్పటి వరకు నా డిమాండ్కు అతీ లేదు.. గతీ లేదు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగుపెట్టగానే కరెంట్ కోతలు బంద్
మనదేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. దేశంలో 381 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. 150 ఏండ్ల దేశ అవసరాలకు సరిపోతుంది. వీటితో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. దేశ భూగర్భంలో ఇంత విస్తారమైన బొగ్గు గనులున్నా మనం ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి. దేశంలో చౌకగా దొరికే బొగ్గును కాదని, విదేశాల నుంచి ఖరీదైన బొగ్గును ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీనిపై చర్చ పెట్టి రైతులు, ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రజలను చైతన్యం చేసి పోరాటానికి సిద్ధం చేయాలి. పోరాటం అంటే రోడ్లు ఎక్కడం కాదు. అంబానీ, అదానీలకు కట్టబెట్టి ప్రజల నోట్లో మట్టికొడ్తారా? కరెంట్ ఉత్పత్తిని ప్రైవేట్పరం చేయండి.. కరెంట్ బిల్లులు పెంచండి.. అనే విధానాలు అనుసరించటం ఎవరి ప్రయోజనాల కోసం? అని బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాలుపెట్టి ప్రశ్నించటం మొదలుపెట్టగానే రైతులకు కోతల్లేని కరెంట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అంటే భయం పుట్టుకొని కోతల్లేని కరెంట్ ఇస్తున్నారు.
నేతలకు దివాలా.. రైతులకు దివాళి
తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో అమలు చేయాలంటే రూ.49 వేల కోట్లు కావాలి.. అలా చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది.. కనుక మేం తెలంగాణ మాడల్ను అనుసరించం అని మహారాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. రైతులు సచ్చినా మంచిదే అని మొండిగా చెప్పింది. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు రైతులను నిర్దయగా వదిలిపెట్టింది. అన్నివిధాలా సిరిసంపదలతో ఉన్న మహారాష్ట్ర, అనేక పరిశ్రమలకు ఆలవాలమై.. అనేక వృద్ధిచెందిన నగరాలకు పేరెన్నికగన్న మహారాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతున్నది? అందుకే దివాలా తీయాల్సింది నేతలు. దివాళి జరుపుకోవాల్సింది రైతులు అని బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తున్నది. రైతులు నిజంగా పండుగ చేసుకునే కాలం రావాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి వంశీధర్రావు, నగేశ్ వల్యాల్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో మార్పు తెస్తాం
మహారాష్ట్రలో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అక్కడ నాలుగైదు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రజలు ప్రతి పార్టీకి అధికారం ఇచ్చారు. నేరుగానో, సంకీర్ణంలోనో అన్ని పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయినా ఏ ఒక్క పార్టీ కూడా రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదు? ప్రజలను ఎందుకు పట్టించుకోదో ఆలోచించాలి. ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే కచ్చితంగా మార్పు రావాల్సిందే. తెలంగాణలో సంక్షేమం జరుగుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు? సరిహద్దు జిల్లాల నుంచి వేల మంది దాకా తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. ఇక్కడి రైతులతో, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇంటింటికీ బిగించిన నల్లాలను చూస్తున్నారు. సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెళ్లి అక్కడ చెప్పుకుంటున్నారు.
భారత పరివర్తనే బీఆర్ఎస్ లక్ష్యం
బీఆర్ఎస్ పేరుకే పార్టీ. కానీ, భారత్ పరివర్తనే బీఆర్ఎస్ అసలు లక్ష్యం. భారతదేశం అంతా మార్పు చెందాన్నదే బీఆర్ఎస్ మిషన్. ఈ నేపథ్యంలో రెండు విషయాలు మీకు చెప్తా. జాగ్రత్తగా వినండి. దేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా తాగునీటికి ఒక విధానం అంటూ లేదు. దేశంలో నీళ్లు లేకనా? నీటి లభ్యత లేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, దేశంలో మనకు కావలసిన అవసరాలకు రెట్టింపు స్థాయిలో నీటి వనరులు ఉన్నాయి. దేశంలో 1లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుంది. ఇందులో సగం ఆవిరైపోనూ 70 వేల టీఎంసీలు నీరు అందుబాటులో ఉన్నది. 75 ఏండ్ల దేశ స్వాతంత్య్రానంతరం ఈ దేశం వినిగియోగించుకుంటున్నది కేవలం 19 వేల టీఎంసీలే. మిగిలిన 51వేల టీఎంసీల మన కండ్ల ముందే సముద్రంపాలు అవుతున్నాయి.
దేశంలో భూగర్భజలాలు పడిపోతుంటే తెలంగాణలో పైపైకి
దేశంలో విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉన్నది. దేశానికి కావాలసిన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సత్తా ఉన్నా ప్రజలకు కరెంట్ కష్టాలెందుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి, బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడేనాటికి మహారాష్ట్ర కన్నా ఘోరమైన కరెంట్ సమస్య. పగలు మూడు గంటలు, రాత్రి నాలుగు గంటలు ఉండేది. రాత్రిపూట కరెంట్తో పాము, తేలుకాటుకు, కరెంట్షాక్కు ఇలా అనేక విధాలుగా రైతులు మరణించేవాళ్లు. ఇటువంటి తీవ్ర పరిస్థితుల మూలంగా తెలంగాణలోనూ ఆత్మహత్యలు తీవ్రంగా వేధించేవి. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువులను బాగుచేసుకున్నాం. వాగుల మీద చెక్డ్యాములు కట్టుకున్నాం. ఫలితంగా దేశంలో ఏ రాష్ట్రంలోలేని లేనివిధంగా భూగర్భ జలాలు పెరిగాయి. తెలంగాణలో భూగర్భ జలాలు పైకి వస్తుంటే ఇతర రాష్ర్టాల్లో పడిపోతున్నాయి.
రైతుల క్షేమం కోరిన ఐఏఎస్ అధికారి
మహారాష్ట్ర రైతులు బాగుపడాలంటే తెలంగాణ మాడల్ను అమలు చేయటం మినహా గత్యంతరం లేదు. ఇప్పటికే వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం తక్షణం ఆదుకోకపోతే లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉన్నదని, వీటిని తక్షణం నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సాగునీరు అందించడంతోపాటు, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయటం వంటి మానవీయ విధానాలను అమలు చేయాలని ఇటీవల ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ప్రభుత్వానికి సూచించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనను పిలిపించుకొని దూషించి.. బెదిరించారు. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర సర్కారుకు మద్దతు ఎట్లా ఇస్తావని ప్రశ్నించారు. దీంతో ఆ అధికారి ఏమీ చేయలేక తన పదవికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇంతటి దుస్థితి మహారాష్ట్రలో నెలకొన్నది. మహారాష్ట్రలో అద్భుతమైన క్షీరసంపద ఉన్నది. పాల ఉత్పత్తి చేసే రైతులకు మహారాష్ట్ర సర్కారు ఎటువంటి ప్రోత్సాహం అందించటం లేదు. తెలంగాణలో పాల ఉత్పత్తిదారులైన రైతులకు లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకంగా అందిస్తున్నది. రైతులందరినీ ఏకం చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన మహారాష్ట్ర సర్పంచ్లు వీరే.
భారత్ రూప్ నర్ (ఔజ్ గ్రామం), అమర్ పాటిల్ (బోరుల్ గ్రామం), విద్యాధర్ వల్సంగే (ఇంగల్గి), ఇర్ఫాన్ షేక్ (హనమ్ గావ్ గ్రామం ), మహేష్ పాటిల్ (తొగరల్లి గ్రామం ), బస్వరాజ్ మిర్జే ( దిండూర్ గ్రామం), విఠల్ పాటిల్ (తిర్థ్ గ్రామం ), నాగేష్ షిండే ( కర్దేహల్లి గ్రామం ), బాబా హండే (వాంగీ గ్రామం), శ్రీశైల్ వ్హన్ మానే (మద్రే గ్రామం), మాయావతి పాటిల్ ( హిప్లే గ్రామం), అశోక్ సోన్ కట్లే (హత్తర్ సంగ్ గ్రామం), ఆనంద్ దేశ్ ముఖ్ (బసవ్ నగర్ గ్రామం), సూర్యకాంత్ యార్గలె (ధోత్రి గ్రామం), పరమేశ్వర్ షిండే (ఔరాద్ గ్రామం ), పండిత్ బుల్గుండే ( సంజ్ వాల్ గ్రామం), సుశీలా ఖ్యామగుండే ( టాకలి గ్రామం), ధర్మరాజ్ రాఠోడ్ (హత్తుర్ గ్రామం), భరమన్న గావ్డే (సింద్ ఖడే గ్రామం), సుఖ్ దేవ్ గావ్డే (గావ్డేవాడి గ్రామం), లక్ష్మణ్ హాకే (వర్లేగావ్ గ్రామం), జావేద్ షేక్ (గంగేవాడి గ్రామం), గురునాథ్ కొట్టాల్గి (లవంగి గ్రామం), అప్పు కోలి ( తెల్గావ్ గ్రామం), చంద్రకాంత్ చవ్హాన్ (ఘోడాతాండా గ్రామం), అణ్సిద్ధ్ దేశ్ ముఖ్ (కారల్ గ్రామం), కాశీనాథ్ బిరాజ్ దార్ ( వడ్ గావ్ గ్రామం), సమీర్ షేక్ (కుడల్ గ్రామం), సంజ్ కుమార్ లోణారి (ఇలేగావ్ గ్రామం), శ్రీమతి హోన్ మానే (వడబాల్ గ్రామం), రాజశేఖర్ సగ్ రే (బంక్ లగీ గ్రామం), అభిమాన్ ఘంటే ( మన్ గోలే గ్రామం), ఉమ్జజ్ ముజావర్ (వడ్ జీ గ్రామం), సురేష్ సోలంకర్ ( తిల్లేహాల్ గ్రామం), బాపూరావ్ దేశ్ ముఖ్ పాటిల్ (బోల్ కవ్ ఠా గ్రామం), హన్మంత్ కోలి ( శింగడ్ గావ్ గ్రామం), అనిల్ బర్వ్ (వల్ సంగ్ గ్రామం), రాజేంద్ర చవ్హాన్ (ఫతాటెవాడి గ్రామం), మహేశ్ వ్హటానే (హోట్గీ గ్రామం), ప్రకాశ్ సుతార్ ( ముస్తీ గ్రామం), సుధాకర్ కోలి (సాదెపూర్ గ్రామం), సమర్థ్ దుర్గే ( కుంభారి గ్రామం), రాజ్ కుమార్ బిరాజ్ దార్(దర్గన్ హల్లి గ్రామం), జిగర్ పాటిల్ (చించోలి గ్రామం), సాగర్ కోలి (ఆచెగావ్ గ్రామం), సురేష్ డవ్లే (హోట్గీ స్టేషన్ గ్రామం), నానా దోర్ ములే (ఆలెగావ్ గ్రామం), సంగప్ప కోలి (బాల్ గి గ్రామం), మల్లినాథ్ మాలి (ములేగావ్ గ్రామం), కొండీబా రాఠోడ్ (బక్షీ హిప్పర్ గీ గ్రామం), అమోల్ సౌదాగర్ (సంగ్ దరీ గ్రామం), తుకారాం షెండ్ గే (యత్ నాల్ గ్రామం)