బాసర, అక్టోబర్ 2: తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బాసరలో మూల నక్షత్ర పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు సురేఖలక్ష్మణ్ వినతిప్రతం అందజేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై వచ్చినట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లో తమ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని, కేసీఆర్ అనుమతితో ఆయన స్థాపించబోయే పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నాందేడ్ జిల్లాలో నయాగావ్, బిలోలి, దెగ్లూర్, భోకర్, ముకెడ్, హత్గావ్, లోహ, నాందేడ్ నార్త్, నాందేడ్ సౌత్ నియోజక వర్గాలు ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయంగా అనుభవమున్న వారు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ధర్మాబాద్ తాలూకాలో కేసీఆర్ ఒక్కసారి పర్యటించాలని కోరారు. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటుతో పాటు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, రుణమాఫీ పథకాలు చాలా బాగున్నాయని వివరించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన వారిలో ధర్మాబాద్ మాజీ సర్పంచ్ శంకర్పాటిల్, విలేగాం మాజీ సర్పంచ్ శివాజీపాటిల్ తదితరులు ఉన్నారు.