Unemployment | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగం యువతకు శాపంగా మారుతున్నది. మరణశాసనాన్ని రాస్తున్నది. దేశంలో ప్రతిరోజు సగటున 10మంది నిరుద్యోగులు ఆత్మహ్మత్యలకు పాల్పడుతున్నట్టు కేంద్రం లోక్సభలో వెల్లడించింది. 2020-22 మధ్య మూడేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా 10,259 మంది నిరుద్యోగం కారణంగా ప్రాణాలు వదిలారు. దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ నిరుద్యోగుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన ఆత్మహత్యల్లో 20 శాతం ఒక్క మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి. ప్రతి ఐదింటిలో ఒకటి ఇక్కడే నమోదువుతున్నది. కర్ణాటక, తమిళనాడు వరుసగా రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రం గుజరాత్ నిరుద్యోగుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉంది. పైన చెప్పుకున్న కాలవ్యవధిలో ఇక్కడ 811 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ఇక్కడ ఈ మూడేండ్లలో 60 మంది మాత్రమే ప్రాణాలు తీసుకున్నారు. 2020లో 23 మంది, 2021లో 28 మంది, 2022లో 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు ఏడాదితో అంటే 2021తో పోల్చితే ఆత్మహత్యల్లో 70 శాతం తగ్గుదల కనిపించింది. దేశంలోని 28 రాష్ర్టాలతో పోల్చినప్పుడు తెలంగాణ స్థానం 20గా ఉంది.
రాష్ర్టాలపరంగా మణిపూర్లోఅతి తక్కువగా రెండు మరణాలు మాత్రమే నమోదు కాగా, నాగాలాండ్లో 8, అరుణాచల్ప్రదేశ్లో 12 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ జాబితాలో అన్నింటికంటే ఆశ్చర్యపరిచిన రాష్ట్రం బీహార్. పేదరికం, నిరుద్యోగం తాండవించే ఇక్కడ 17 మంది మాత్రమే మరణించారు. ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా దొరికిన పని చేసుకునే అలవాటు వల్లే ఇక్కడ ఆత్మహత్యలు తక్కువని నిపుణులు చెప్తున్నారు. యూపీలో 499 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
దేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరింటిలో ఆత్మహత్యలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ మూడేండ్లలో 698 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోగా, పుదుచ్చేరి, లక్షద్వీప్లలో ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. అండమాన్, నికోబార్ దీవులతోపాటు లడఖ్లో గతేడాది ఒక్కోటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.