Mahabubnagar | తెలంగాణ వచ్చినంక కేసీఆర్ నేతృత్వంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో మహబూబ్ నియోజకవర్గంలో సుమారు రూ.9 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మన్యంకొండ దేవస్థానం వద్ద తెలంగాణలో తొలి రోప్వేను నిర్మిస్తున్నారు. దివిటిపల్లి ఐటీ కారిడార్లో రూ.9 వేల కోట్లతో అమరరాజా పరిశ్రమ ఏర్పాటవుతున్నది.
2014 వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఇక్కడి జనం. పాలమూరును అప్పటి పాలకులు దత్తత పేరిట దగా చేశారు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితి మారింది. మహబూబ్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీసింది. ఇక్కడే మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ ఈ బాధలన్నీ కండ్లతో చూసిన ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్గౌడ్ ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వచ్చారు.
పాలమూరులో రోజూ తాగునీళ్లు
మహబూబ్నగర్ పట్టణంలో తాగునీటి సమస్య తీరింది. వచ్చిన రెండేండ్లకే మంత్రి శ్రీనివాస్గౌడ్ తాగునీటి ఎద్దడిని తీర్చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ తీసుకురావడంతో రోజూ పుష్కలంగా తాగునీళ్లు సరఫరా అవుతున్నాయి. 2087 ఎకరాల్లో కేసీఆర్ అర్బన్ పార్కు హైలెట్గా నిలిచింది. ఈ పార్కులో అనేక సదుపాయాలు కల్పించడంతో టూరిస్టు స్పాట్గా మారిం ది. పార్కు పక్కనే ఉన్న జంగల్ సఫారీ ప్రారంభమయ్యింది. పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దారు. మురుగు నీరు చెరువులోకి వెళ్లకుండా ప్రత్యేక కాల్వల ద్వారా బయటికి పంపిస్తున్నారు. చెరువు మధ్యలో ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి ఆకట్టుకుంటాయి.
రాష్ట్రంలోనే టాప్టెన్ కాలేజీల్లో ఒకటిగా మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ
మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే టాప్టెన్ కాలేజీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈ కాలేజీకి అనుబంధంగా ఉన్న జిల్లా దవాఖానలో ఆధునిక వసతులు కల్పించి పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. వెయ్యి పడకల టీచింగ్ దవాఖాన నిర్మిస్తున్నారు. నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలతోపాటు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల కూడా మంజూరయ్యింది. పట్టణాన్ని కార్పొరేషన్ చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికలు అయ్యాక కార్పొరేషన్గా మారే అవకాశం ఉన్నది.
శరవేగంగా పారిశ్రామిక, విద్య, వైద్యం..
పట్టణం సమీపంలోని దివిటిపల్లి గ్రామంలో ఐటీ కారిడార్ ఏర్పాటయ్యింది. ఇక్కడ సుమారు 12 కంపెనీలు కొలువు దీరాయి. ఇందుకోసం 4 వందల ఎకరాల భూమిని సేకరించారు. దీంట్లో లిథియం బ్యాటరీల ఉత్పత్తి సంస్థ అమరరాజా పరిశ్రమ నెలకొల్పుతున్నది. రూ.9 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే సుమారు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హన్వాడ మండల కేంద్రంలో ఫుడ్ పార్కు నిర్మాణం కోసం 150 ఎకరాల సేకరణ జరిగింది.
లక్ష ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా..
బీఆర్ఎస్ సర్కారు సాగునీటి రంగానికి ప్రాధాన్యమిస్తుండటంతో కొన్నేండ్లుగా భూగర్భ జలాలు పెరగడం, చెరువులు, కుంటలు మత్తడి దుంకడంతో వ్యవసాయం జోరందుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు నింపితే భూగర్భ జలాలు మరింత ఉబికి వస్తాయి. ఈ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ హన్వాడ మండలంలోని చెరువును రిజర్వాయర్గా మార్చాలని ప్రతిపాదించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే కాల్వల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే పాలమూరులో సాగునీరు పారనున్నది.