మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ జనరల్ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మహబూబ్ నగర్ కు రాష్ట్రంలోనే మొదటి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కూడా మంజూరు చేశారని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటికే మూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన ప్రభుత్వం, త్వరలో మరో రెండు కళాశాలల పనులు కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల సొంత భవనాలు కూడా త్వరలో నిర్మిస్తామని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో పదిమంది వైద్యులు 20 మంది నర్సులు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు సుమారు వందమందికి పైగా డాక్టర్లు 400 మందికి పైగా నర్సులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ జనరల్ దవాఖాన పేద రోగులకు ఎంతో భరోసానిస్తోందన్నారు.
రాబోయే ఏడాది కాలంలో పాత కలెక్టరేట్ వద్ద నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషల్ హాస్పిటల్ పనులు ప్రారంభించి గుండె, కిడ్నీ సహా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామన్నారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని సూచించారు.