మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాను మాతా, శిశు మరణ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక యశోద గార్డెన్లో పోషణ్ అభియాన్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ అధికారి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన పోషణ్ మాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మంత్రి సత్యవతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాలతో పాటు గర్భం దాల్చిన మహిళలు, కౌమారదశలోని యువతులు, డెలివరీ తర్వాత సరైన ఎదుగుదల లేని వారందరిని గుర్తించి పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అంగన్వాడీ టీచర్లు, వైద్యులకు సూచించారు.
మాతా, శిశువుల చికిత్సల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ గిరిజనులు ఏజేన్సీ ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారని వారందరికీ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పోషణ్ మాసోత్సవం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాలు సలహాలు, సూచనలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వ మాత్రం ఇక్కడి గిరిజనులను దృష్టిలో ఉంచుకుని ఆచరణ సాధ్యం చేయడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకే పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతందని వివరించారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి స్వర్ణలత ఆధ్వర్యంలో అంగన్వాడీల సేవలు మెరుగ్గా ఉన్నాయని అభినందించారు.
ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వమే వారికి పౌష్టికాహారం అందిస్తుందన్నారు. అంగన్వాడీల సేవలతోనే మహిళా, శిశువులు ఆరోగ్యంగా ఉంటున్నారని కొనియాడారు. నాటి రోజుల్లో కలుషితం లేని నాచురల్ ఆహార పదార్థాలు తిన్న మన పెద్దలు నేటికి మనకంటే బలంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇండ్లలోనే కూరగాయలు పండించి ఆహారాల కోసం ఉపయోగించుకోవాలన్నారు. గర్భం దాల్చిన ఆరు నెలల నుంచి డెలివరీ అయిన మూడు నెలల వరకు మాతా, శిశువులకు ఆహార లోపం లేకుండా ప్రతి ఒక్కరికీ రూ. 2వేలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాలో పౌష్టికాహార లోపం కనిపిస్తుందని వారందరిని గుర్తించి పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని అన్నారు. గత 30-40 ఏళ్లుగా లేని బలహీనతులు నేడు కనిపిస్తున్నాయన్నారు. వీటిని అదిగమించాలంటే పౌష్టికాహార లోపం ఉన్న చిన్న పిల్లలు, గర్భవతులు, కౌమారదశలోని యువతులు, మహిళలను గుర్తించి వారికి పౌష్టికాహార అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఆరోగ్యంపై చేసే పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రతి గడపకు చేరాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి వైస్ చైర్మన్ ఫరీద్, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి స్వర్ణలతాలెనినా, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, మెంబర్ అశోక్, వార్డు కౌన్సిలర్ ఎడ్ల వేణు, ఎస్సీపీసీఆర్ బృందాధర్ పాల్గొన్నారు.