యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజైన నేడు ఉదయం యాగశాల ప్రవేశం, మండప స్తంభద్వార తోరణపూజ, చతుస్థానార్చనలు, మహారుద్ర పురశ్చరణ, అగ్ని ప్రతిష్ట, మూల మంత్రానుస్థాన హావన పూజలు చేస్తారు. సాయంత్రం శాంతి, దీక్షా హోమం, అగ్నిత్తారణము, కౌతుక బంధనం, జలాధివాసం పూజలు నిర్వహిస్తారు.
స్వయంభూ పంచనారసింహుడి అనుమతితో బుధవారం బుధవారం ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు విఘ్నేశ్వరుడి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీరాంపురం (తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో శివాలయం మాఢవీధుల్లో నిర్మించిన యాగశాల ప్రాంగణంలో విఘ్నాధిపతి అనుగ్రహాన్ని పొందారు. స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, నాందిముఖం, దేవతారాధన, దేవతాహ్వానం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, అంకురారోపణ నిర్వహించారు.