వరంగల్ : జనవరి 26వ తేదీ నుంచి వరంగల్ పరిధిలోని పర్వతగిరి పర్వతాల గుట్ట శివాలయంలో జరిగే మహా కుంభాభిషేకం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం శివాలయ పునః ప్రతిష్ట ఏర్పాట్లను, భక్తుల వసతులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ప్రముఖ వాస్తు నిపుణులు నూకల నరేశ్రెడ్డి తో కలిసి పరిశీలించారు.
పవిత్ర కార్యక్రమంలో జనగాం, వరంగల్, హనుమకొండ జిల్లాలు పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజలు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో వసతులలో ఎలాంటి లోపం లేకుండా చూడాలన్నారు. భక్తులు తమ వెంట శివునికి అభిషేకం చేసే పూజ సామాగ్రితో ఆలయానికి రావాలని కోరారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని పేర్కొన్నారు.
రోడ్డు, తాగునీరు, విద్యుత్, పోలీసు శాఖల సమన్వయంతో కార్యక్రమం విజయవంతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కుంభాభిషేక కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఉన్నారు.