హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ రక్షణ పేరిట ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ.. జనగణనతోపాటు కుల గణన కూడా చేపట్టాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నాలో తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ ఆనంద్, డాక్టర్ సంజీవ్నాయక్, బొంకూరు సురేందర్ సన్నీ, సుజిత్ రావణ్, పేట భాసర్, జవహర్ నవాజ్ సత్పాల్, వివిధ రాష్ట్రాల నుంచి దళిత, గిరిజన, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.