బంజారాహిల్స్,అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతాగోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 2014 నుంచి ప్రతి ఎన్నికల సందర్భంలోనూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నామినేషన్ వేయడానికి ఇంటినుంచి బయలుదేరే సమయంలో పెద్ద కుమార్తె అక్షర ఎదురు రావడం, అక్కడినుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత పెద్ద కుమార్తె అక్షర ఎదురురాగా పెద్దమ్మగుడికి బయలుదేరారు.
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి స్వయంగా కారు నడుపుతూ వారిని తెలంగాణభవన్కు తోడ్కొనివచ్చారు. తెలంగాణభవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు ముఖ్య నాయకులతో కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మొదటి సెట్ నామినేషన్ను కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి, కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు దివంగత సర్ధార్ సతీమణి సమీనా యాస్మిన్తో కలిసి దాఖలు చేశారు. మరో సెట్ నామినేషన్ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావుగౌడ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యరావుతో కలిసి దాఖలు చేశారు.