హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నేతలను కోసి వాళ్ల రక్తం పొలాల్లో చల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అనాగరికం, ఆటవికం, అహంకారపూరితం అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ నాయకుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు అని, అంతమాత్రాన ఈ విధంగా విమర్శలు గుప్పించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. హింసను ప్రేరేపించేలా ఉన్న సీఎం వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదుకు పోలీసులను ఆదేశించాలని కోరారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను ఖండించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
సుదీర్ఘకాలం సాగునీటి రంగంలో విశేష సేవలందించిన ఇంజినీర్లను, సూపర్ ఎల్ నినో వస్తుందని హెచ్చరించిన వాతావరణశాఖ అధికారులను జైళ్లో పెడుతానని బెదిరించడం.. వారి సేవలను దుర్భాషలాడడం మూర్ఖత్వమని నిప్పులు చెరిగారు. మీడియా, మేధావులు, ఇంజినీరింగ్ నిపుణులు, రైతు సంఘాల నాయకులు కన్నెపల్లి పంప్లను ఆన్చేసి నీళ్లివ్వాలనే డిమాండ్లను పెడచెవినపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మురికి భాషతో తెలంగాణ ప్రజలు, బుద్ధిజీవులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. జుగుప్సాకరమైన మాటలతో రిటైర్డ్ ఇంజినీర్లు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. రేవంత్రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం తన గురువు చంద్రబాబుకు వంత పాడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 30 నెలల రేవంత్రెడ్డి పాలనలో పేదల బతుకులు కూల్చుడు తప్ప, ఒరగబెట్టిందేమీలేదని విరుచుకుపడ్డారు.