హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పీ మధుసూదన్రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. సంఘం మూడో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆదివారం హైదరాబాద్లో నిర్వహించగా, ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన్నే మరోసారి ఎన్నుకున్నారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమావేశానికి హాజరై మాట్లాడారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా బలరాం జాదవ్, అసొసియేట్ అధ్యక్షుడిగా ఈ శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్ శ్రీనివాస్, జీ సత్యపాల్రెడ్డి, జీ వేణుగోపాల్, టీ శ్రీధర్, ఎన్ రమేశ్, వీ అశోక్, సంయుక్త కార్యదర్శిగా ఎం విజయశేఖర్, ఆర్థిక కార్యదర్శిగా ఏ శివప్రసాద్, మహిళా కార్యదర్శిగా ఎస్ పద్మావతి, రాష్ట్ర కార్యదర్శులుగా వీ ప్రమీల, ఏఏవీ ప్రసాద్, ఎం హరిప్రసాద్, ఫహీముద్దీన్, జీ మధు, కే శ్రీదేవిని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు 7.5శాతం నిధులు కేటాయించడంపై సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. రాష్ట్రంలో 10+2+3 విద్యావిధానాన్ని యాధావిధిగా కొనసాగించి, ఇంటర్ విద్య అస్తిత్వాన్ని గుర్తించాలని డిమాండ్ చేసింది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరింది.