మధిర టౌన్, ఫిబ్రవరి 25: కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఓ ఇన్చార్జి హెచ్ఎం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తొలివిడత ‘మన బస్తీ- మన బడి’కి ఖమ్మం జిల్లా మధిర జడ్పీహెచ్ఎస్ ఎంపికైంది. పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సర్కార్ రూ.23.82 లక్షలు నిధులు కేటాయించింది.
కాంట్రాక్టర్ మునుగోటి వెంకటేశ్వర్లు పనులు ప్రారంభించాడు. చేసిన పనులకు 2 నెలల క్రితం రూ.7.88 లక్షల చెక్కు విడుదలైంది. చెక్కు ఇవ్వాలని కాంట్రాక్టర్ 20 రోజులుగా కోరుతున్నా హెచ్ఎం మాతంగి శ్రీలత కనికరించలేదు. రూ.50 వేలు లంచం ఇస్తే తప్ప చెక్కులు ఇవ్వనని బెదిరించగా.. శనివారం రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు హెచ్ఎం శ్రీలతను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు తెలిపారు.