హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మాదాపూర్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ, రైటర్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..
మాదాపూర్లోని సాయినగర్ తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్ను ఒక కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు, లోక్ అదాలత్లో కేసులను సెటిల్ చేసేందుకు ఎస్ఐ రంజిత్కుమార్ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు లక్ష్మణ్ విన్నపం మేరకు రూ.30 వేలకు ఎస్ఐ రంజిత్కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం మాదాపూర్ పోలీస్స్టేషన్పై మెరుపు దాడులు జరిపారు. ఈ దాడుల్లో బాధితుడి వద్ద నుంచి రూ.30 వేల లంచం తీసుకున్న రైటర్ విక్రమ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని, లంచం సొమ్మును సీజ్ చేశారు.
ఎస్ఐ రంజిత్కుమార్ ఆదేశాల మేరకే ఆ డబ్బు తీసుకున్నట్టు విక్రమ్ వెల్లడించడంతో లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్కుమార్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి, నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.