హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/మహాదేవ్పూర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ లక్ష్మీబరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన పిల్లర్కు సొంత నిధులతో మరమ్మతులు చేపడతామని బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ బిజినెస్ హెడ్ జీఎం సురేశ్కుమార్ తెలిపారు. కుంగుబాటుకు గల సాంకేతిక కారణాలను అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. బరాజ్కు వాటిల్లిన నష్టాన్ని సొంత ఖర్చులతో సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆదివారం సురేశ్ బృందంతో పాటు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు బృందం సంయుక్తంగా బరాజ్ వద్దకు చేరుకుని విచారణ జరిపింది. అనంతరం సురేశ్కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగుబాటు పెద్ద సమస్య కానేకాదని తేల్చి చెప్పారు. పిల్లర్ కుంగుబాటుకు ముందు బరాజ్ వద్ద వచ్చిన శబ్దంపై అనుమానం వ్యక్తం చేశారు. 86 పిల్లర్లతో 1.632 కిలోమీటర్ల పొడవునా బరాజ్ నిర్మించామని, 2019 నుంచి అది పనిచేస్తున్నదని గుర్తు చేశారు. ఈ ఏడాది వరద సీజన్ సహా గత ఐదు వరద సీజన్లను బరాజ్ తట్టుకున్నదని తెలిపారు. బరాజ్ డిజైన్ సామర్థ్యానికి మించి నిరుడు 28.70 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తిందని పేర్కొన్నారు. జూలై 2022లో సంభవించిన అసాధారణ వరదలను కూడా బరాజ్ తట్టుకుందని వివరించారు.
బరాజ్లో నీరు తగ్గగానే సోమవారం సాయంత్రం కిందికి దిగి వివరాలు సేకరిస్తామని సురేశ్కుమార్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఒక పిల్లర్ వద్ద స్వల్పంగా కుంగిందని, నెల రోజుల్లో పనులు పూరి ్తచేసి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. నాణ్యత లోపానికి ఏ మాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎల్అండ్టీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భారీ నిర్మాణాలు చేపట్టిందని, ఎక్కడా ఎలాంటి రిమార్క్ రాలేదని పేర్కొన్నారు. ఐదేళ్ల వారెంటీ పిరియడ్ ఉండడంతో ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదని చెప్పారు. త్వరలోనే రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు.