హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న జల విద్యుత్తు ఈ ఏడాది ముఖం చాటేసింది. గత మూడు సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 5,654.7 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 6,058 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి జరగడంతో సగటు ఉత్పత్తి 5856.3 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో కనీసం 1,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కూడా జరగలేదు. నవంబర్ నాటికి ఉత్పత్తి కేవలం 987.7 మిలియన్ యూనిట్లకే (17 శాతానికి) పరిమితమైంది. ఈ ఏడాది కృష్ణా నదికి వరద రాకపోవడం, రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోవడమే ఇందుకు కారణం. దీంతో కృష్ణా నదిపైనే ఉన్న జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి చేసేందుకు వీల్లేకుండా పోయింది. అందుకు ప్రత్యామ్నాయంగా థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)ను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విద్యుత్తు సంస్థలపై, అంతిమంగా ప్రభుత్వంపై అదనపు భారం తప్పడం లేదు.
రాష్ట్రంలో ఎక్కువ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కృష్ణా నదిపైనే ఉన్నాయి. కానీ ఈ ఏడాది కృష్ణా నదికి వరదలు రాకపోవడంతో పలు రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో కేవలం 53 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 86.9 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీన్ని ఉపయోగించి మొత్తంగా మరో 360.6 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేయగలం. కానీ, ఆ నీటిని కూడా రాష్ట్ర ప్రజలకు తాగునీటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన 3 నెలల్లో జల విద్యుత్తు ఉత్పత్తయ్యే పరిస్థితే లేదు.
ప్రస్తుతం రాష్ట్ర అవసరాల కోసం థర్మల్ విద్యుత్తు కేంద్రాలపైనే దృష్టి సారించాల్సి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల మొత్తం సామర్థ్యం 4,042.5 మెగావాట్లుగా ఉన్నది. ఈ కేంద్రాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% పీఎల్ఎఫ్తో 24,800.3 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 71.84% పీఎల్ఎఫ్తో 25,441.9 మిలియన్ యూనిట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో గత నెల చివరి నాటికి 78.51% పీఎల్ఎఫ్తో 18,586.2 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశారు. యాసంగి వల్ల వచ్చే 3 నెలల్లో విద్యుత్తు డిమాండ్ పెరగనున్నందున పీఎల్ఎఫ్ను మరింత పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతం నెలకు 2,200 మిలియన్ యూనిట్లుగా ఉన్న సగటు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిని రానున్న 3 నెలల్లో 2400 నుంచి 2450 మిలియన్ యూనిట్ల స్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెలలో చలి తీవ్రత పెరగడంతో విద్యుత్తు డిమాండ్ కొంత తగ్గినప్పటికీ వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల విద్యుత్తు డిమాండ్ పెరగడం ఖాయం. దీన్ని అధిగమించాలంటే బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేయక తప్పదు. దీంతో డిస్కంల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు’ తయారవుతుంది.