హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. శనివారం నుంచి వాతావరణం పూర్తిగా సాధారణంగా ఉంటుందని, ఉక్కపోతలు మొదలవుతాయని వివరించింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21గా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 4.36 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గూడూరులో 1.38 సెం.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసినట్టు వెల్లడించింది. మార్చి 1 నుంచి ఎండలు మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.