ప్రగతిపై నిర్లక్ష్యం చేసిన గత పాలకులు
కాగితాల మీదే లెక్కలు చూపారు
మొక్కల పెంపకం అందరి బాధ్యత
గ్రామాల వారీగా కూరగాయలు సాగు చేయాలి
మంత్రి జగదీశ్రెడ్డి.. తిరుమలగిరిలో
‘పట్టణ ప్రగతి’ ప్రారంభం
తిరుమలగిరి, జూలై 1 : గత పాలకుల నిర్లక్ష్యంతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి దూరమయ్యాయని, ప్రజల భాగస్వామ్యంతోనే ఆశించిన ప్రగతి సాధ్యమవుతుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరిలో నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతే పల్లెలు, పట్టణాలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నాయన్నారు. హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, గ్రామాల్లో కూరగాయల సాగు పెంచాలని కోరారు. అంతకు ముందు మూడో వార్డులో మంత్రి ఇంటింటికీ నడుచుకుంటూ వెళ్లి మహిళలతో మాట్లాడారు. మొక్కల పెంపకం, పారిశుధ్యంపై అవగాహన
కల్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గుణాత్మక మార్పు సాధ్యమైందని, పచ్చదనం, పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని, దాదాపు ఆరు దశాబ్దాల పాలనలో నిధులు దుర్వియోగమయ్యాయని మండిపడ్డారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం హరితహారంలో సూపర్ సక్సెస్ అయ్యిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దండిగా నిధులు విడుదల చేస్తుండడంతో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో అందంగా కనిపిస్తున్నాయని, ప్రజల్లో చైతన్యం పెరిగిందని చెప్పారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి హరితహారం మొక్కలతో కొత్త అందాలు సంతరించుకున్నదని అన్నారు.
దళిత సాధికారత పథకం దేశ చరిత్రలోనే గొప్పదని, గత ప్రభుత్వాలు దళిత సమాజ సంక్షేమం విస్మరించాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడుడిగా దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. దళితులు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో రాణించేలా పేద కుటుంబానికి రూ.10లక్షలు అందించనున్నారని వెల్లడించారు. సొంత స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నదని మంత్రి చెప్పారు. పట్టణ ప్రగతితో తిరుమలగిరి మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందని, అన్ని వార్డుల్లో ప్రకృతి వనాలు పెంచి పచ్చదనం పెంచేలా కృషి చేయాలని కోరారు. మున్సిపాలిటీకి ఒక జేసీబీ, 5ట్రక్కులు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రగతి పరుగులు తీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని, వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, మార్కెట్ చైర్మన్ అశోక్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, కౌన్సిలర్ సరిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.