విద్యుత్తు రంగానికి కొత్త జవసత్వాలు తెస్తామంటున్న కేంద్రం నిజానికి ఆ రంగాన్ని దొంగ దెబ్బతీస్తున్నది! కేంద్రం అనుసరిస్తున్న విధానాలు.. వివిధ రాష్ర్టాల్లోని డిస్కంల నడ్డి విరుస్తూ.. వాటిని నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. పరోక్షంగా భారం మోపుతూ చార్జీలు పెరిగేలాచేసి.. డిస్కంలు దివాలాతీసేలా కేంద్రం వెన్నుపోటు పొడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ వర్కింగ్ గ్రూప్ ఇటీవల చేసిన అధ్యయనంలో ఇటువంటి అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): విద్యుత్తురంగాన్ని నష్టాలనుంచి బయటపడేయడమే తమ ధ్యేయమంటూ కేంద్రం చెప్తున్నవి డొల్ల మాటలేనని తేలింది. విద్యుత్తు రంగాన్ని లాభాలబాట పట్టించడం అటుంచితే.. కేంద్రం పన్నులు, రవాణాచార్జీలను పెంచడంతో డిస్కంలు మరింతగా నష్టాల్లో కూరుకుపోతున్నాయని వెల్లడైంది. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ (ఎఫ్వోఆర్) ఆధ్వర్యంలోని వర్కింగ్గ్రూప్ చేసిన అధ్యయనంలో ఇలాంటి అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి. భారీగా మోపుతున్న పన్నుల వల్ల విద్యుదుత్పత్తి వ్యయం మరింతగా పెరుగుతున్నదని.. తద్వారా చార్జీలు భారీగా పెరుగుతాయని ఎఫ్వోఆర్ పేర్కొన్నది. పరోక్షంగా భారం మోపుతూ చార్జీలు పెరిగేలాచేసి.. డిస్కంలు దివాలాతీసేలా కేంద్రం వెన్నుపోటు పొడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది. కేంద్రం పన్నులు తగ్గించాలని.. తద్వారా విద్యుత్తు చార్జీలతోపాటు, డిస్కంలపైకూడా భారం తగ్గుతుందని కేంద్రానికి ఎఫ్వోఆర్ సిఫారసు కూడా చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే..
కేంద్రవిద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్సీ) ఆధ్వర్యంలో అన్ని రాష్ర్టాలకు సంబంధించిన ఈఆర్సీలు సంయుక్తంగా ఫోరమ్ ఆఫ్ రెగ్యులేటర్స్గా పనిచేస్తున్నాయి. విద్యుత్తు రిటైల్ ధరలను ప్రభావితం చేస్తున్న అంశాలు, తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేసేందుకు దీని పరిధిలో వర్కింగ్గ్రూప్ను ఏర్పాటుచేస్తూ కేంద్రం 2020 అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీచేసింది. పంజాబ్ ఈఆర్సీ చైర్మన్ను ఈ గ్రూప్ చైర్పర్సన్గా నియమించింది. 2020 నవంబర్ 2న మొదటి సమావేశం నిర్వహించిన ఈ గ్రూప్ వరుసగా భేటీ అవుతూ మేధోమథనం చేసింది. 2021, ఏప్రిల్ 30న 75వ సమావేశం జరిపి.. విద్యుత్తు గరిష్ఠ చిల్లర ధరకు కారణాలేమిటి? తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనేదానిపై లోతుగా చర్చించి, వాటిని సిఫారసుల రూపంలో పొందుపర్చి సీఈఆర్సీకి సమర్పించింది.