KTR | మనం సైతం జై శ్రీరామ్ అందామని.. శ్రీరామచంద్రుడు అందరివాడని.. బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, డీలిమిటేషన్లో అన్యాయం జరగవద్దు అంటే అడ్డుకునే శక్తి కేవలం గులాబీ కండువాకే ఉందన్నారు. 2014లో బడే భాయ్.. 2024లో చోటా భాయ్ మోసం చేశారన్నారు. రూ.30లక్షల కోట్లు రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు రుణమాఫీ చేశారని ఆరోపించారు.
తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. పదేళ్లలో ప్రజలను మోసం చేసినవాడు నరేంద్ర మోదీ అని.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా బండి సంజయ్ సవాల్ విసిరారు. కరీంనగర్లో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పోటీ అన్నారు. పోటీలో కాంగ్రెస్ లేదన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ముక్కు మొహం తెలియని వారిని తీసుకువచ్చి నిలబెట్టారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్కు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదని.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్లో కరీంనగర్కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థికి కండువా లేకుండా తిప్పాపూర్ బస్టాండ్లో నిలబెడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తించరన్నారు. 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్కి వస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు సంవత్సరంలోపు వస్తుందన్నారు. వరి పంటకు ఇస్తానన్న రూ.500 రూపాయల బోనస్ బోగస్ అయ్యిందని.. ఆరు హామీలు అమలుకావడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉచిత బస్సు ఉచిత విద్యుత్ పథకాలు కూడా మాయం అవుతాయని.. 70ఏళ్ల వయసులో తుంటి విరిగినా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారన్నారు.
తల్లిలాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన బెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలన్నారు. రోజులో ఉదయం గంట, సాయంత్రం గంట కష్టపడితే విజయం మనదేనన్నారు. పొటోలు దిగి వాట్సాప్లో పెట్టడం కాదని.. అన్నీ అడగాలి.. అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, తోకాడిస్తున్న పోలీసులు మళ్లీ మన మాట వినాలంటే మనకు 10-12 సీట్లు రావాలన్నారు. సంవత్సరంలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే.. మన గెలుపే సమాధానం కావాలన్నారు. పంచాయతీలు, పగలు పక్కనపెట్టి.. అందరూ కేసీఆర్ మనుషులేనన్నారు.