హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశంలో కూడా అదే విషయాన్ని చెప్పారని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్లో విలువను పెంపొందించడానికి నిపుణుల సూచనల నిమిత్తం ఆదివారం జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం ద్వారా ఫలితాల కోసం ప్రయత్నించాలని మహాభారతంలో శ్రీకృష్ణుడు జరిపిన రాయబారం నేటికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అర్బిట్రేషన్ నిర్వహించే వారు ఎలాంటి కీలక పాత్ర పోషించాలో కూడా ఆనాడే శ్రీకృష్ణుడు ఆచరణలో చూపారని గుర్తుచేశారు.‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన..’ వంటి భగవద్గీత శ్లోకం ప్రకారం కర్మలు చేస్తూనే ఉండాలని, కర్మఫలాల్ని ఆశించకూడదని చెప్పారు. నిబద్ధత, న్యాయబద్ధత, ధర్మబద్ధత మార్గాల్లో పయనిస్తూ మధ్యవర్తిత్వం నిర్వహిస్తే కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీ విజయసేన్రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ ఎస్ నంద, జస్టిస్ కే శరత్, జస్టిస్ పీ కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ (ఎస్ఐసీసీ) అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్టీఐ కన్సల్టింగ్లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ తదితరులు పాల్గొన్నారు.