హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్ కనిపించకపోవడంతో సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జగ్గుస్వామికి సైతం ఎల్ఓసీ జారీచేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి తుషార్, జగ్గుస్వామితో సంబంధాలున్నట్టు ఆధారాలు లభించాయి.
ఈ నేపథ్యంలో తుషార్, జగ్గుస్వామిలను విచారణకు పిలిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిద్దరు కనిపించడం లేదన్న సమాచారంతో సిట్ బృందంలోని ఏసీపీ లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వారు దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు ఈ నోటీసులు పంపారు.