హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): లండన్లో భారత స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించగా, ఇందులో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత హై కమిషన్, భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ రాష్ర్టాల సాంస్కృతిక, నృత్యాలు ప్రదర్శించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత 9 ఏండ్లలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, వాటన్నింటి సమాచారాన్ని స్టాల్లో ప్రదర్శించడంతోపాటు వేడుకలకు హాజరైన వారందరికీ వివరించారు.
తెలంగాణ స్టాల్లో కాకతీయ తోరణం ఏర్పాటు చేసి, రామప్పగుడి, వెయ్యిస్థంభాల గుడి చరిత్ర, గోలొండ ఖిల్లా, హైదరాబాద్ ముత్యాలు, బిర్యానీలపై తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రదర్శించారు. తెలంగాణ జానపద గేయాల నృత్య ప్రదర్శన, బతుకమ్మ, బోనాలను ప్రదర్శించగా, ఆహూతులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ముందుగా, భారత హై కమిషనర్ విక్రమ్ కె దొరైస్వామి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. యూకేలోని వేలాది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు తరలివచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, గొప్పతనాన్ని, పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి చాటిచెప్పాలనే ప్రయ త్నం చాలా స్ఫూర్తి దాయకంగా ఉన్నదని టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ఇతర ప్రతినిధులను ప్రత్యేకంగా విక్రమ్ కె దొరైస్వామి అభినందించారు. వేడుకల్లో టాక్ కార్యదర్శి హరి గౌడ్ నవాపేట్, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్లు నవీన్ రెడ్డి , స్వాతి, స్నేహ, పూజ, పుష్పలత, తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షుడు ప్రమోద్గౌడ్ అంతరి, యశస్విని ధనంనేని, రితిశ్రీ ధనంనేని, అచిత వరకాల, ఫోరం వ్యవస్థాపక సభ్యులు రంగుల సుధాకర్గౌడ్, వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్ , కోర్ కమిటీ సభ్యులు మీనా అంతరి, శౌరీ గౌడ్, జయశ్రీ పెద్ది తదితరులు పాల్గొన్నారు.