హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ)/అబిడ్స్: లోధ్ క్షత్రియ సమాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం, నిధులు విడుదలచేస్తూ ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరికి బుధవారం భవన నిర్మాణ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో మూడు సంఘాలుగా ఉన్న లోధ్ సామాజిక వర్గం ‘లోధ్ క్షత్రియ సర్దార్ పంచాయత్’ పేరుతో ఏక సంఘంగా ఏర్పడింది.
అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కోట్ల విలువైన భూములిచ్చి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారని మంత్రి చెప్పారు. ఉప్పల్ భగాయత్లో అరెకరంతోపాటు రూ.50 లక్షలు కేటాయించారని చెప్పారు. తమ సామాజికవర్గానికి ఆత్మగౌరవ భవనం కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు ఎమ్మె ల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.