అడ్డగూడూరు/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు మహిళ లాకప్డెత్ కేసులో స్టేషన్కు చెందిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించారు. మంగళవారం సీపీ మహేశ్భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్డగూడురు పోలీస్స్టేషన్లో ఓ దొంగతనం కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మను అదపులోకి తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా విచారించారు. దీంతో ఆమె మరణించింది. ఈ కేసు విచారణలో తనను కూడా పోలీసులు హింసించారని మరియమ్మ కుమారుడు తెలిపాడు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేపట్టి బాధ్యులైన ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జానయ్యను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏసీపీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. ఈ ముగ్గురిపై కేసు కూడా నమోదు చేశారు. విచారణ పారదర్శకంగా కొనసాగేందుకు ఆర్టికల్ 311(2)(b) ఆఫ్ కాండక్ట్ రూల్స్ 25(2) కింద వారిని సర్వీసు నుంచి తొలగిస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. రాచకొండ పోలీసు కమిషనరేట్లో ఇలా పోలీసులను సర్వీసు నుంచి తొలగించిన ఘటన ఇదే మొదటిది.