హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు సాయంత్రం ఆరు గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మరో పది రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి మర్నాడు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో నిబంధనలను కఠినంగా అమలుచేయాలని మంత్రివర్గం పోలీస్శాఖను ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విస్తరణ ఇంకా అదుపులోకి రాలేదు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతమున్న విధంగానే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటలవరకు లాక్డౌన్ కొనసాగుతుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో యథాతథ స్థితిని కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో లాక్డౌన్ను ఇప్పుడున్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలిస్తారు.
లాక్డౌన్ను మరో పది రోజులు పొడిగించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలనే కొనసాగించింది. లాక్డౌన్ సమయంలో ఈ-పాస్ ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధాన్ని కొనసాగించింది. సరిహద్దుల వద్ద ప్రయాణికుల వాహనాలను రోజంతా నియంత్రించనున్నారు. ఆరోగ్యసిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్కు చెందిన వాహనాలకు మినహాయింపు కొనసాగుతుంది. పెండ్లిళ్లకు గరిష్ఠంగా 40 మంది, అంతిమయాత్రలకు 20 మందినే అనుమతించనున్నట్టు స్పష్టంచేసింది. ఆర్టీసీ బస్సులు, సెట్విన్, మెట్రో, ట్యాక్సీలు, ఆటోలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. జాతీయ రహదారుల పక్కన పెట్రోల్ బంక్లు రోజంతా తెరిచి ఉంటాయి. మిగతావి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. సినిమాహాళ్లు, అమ్యూజ్మెంట్ పార్క్లు, క్లబ్లు, స్విమ్మింగ్పూల్స్, పబ్లు, జిమ్లు, స్టేడియంలు మరో పదిరోజులు మూసి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తి స్థాయి సిబ్బందితో పనిచేస్తాయి.
సిఫారసు మేరకు మంత్రివర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకొనేందుకు పర్యటించింది. అక్కడ కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రానందున ప్రస్తుతమున్న విధంగానే లాక్డౌన్ను కొనసాగించాలని సిఫారసు చేసింది. దానిని మంత్రివర్గం ఆమోదించింది.