హైదరాబాద్, మార్చి 9 : ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, ఆర్టీవో, డీఎస్పీ, జిల్లా రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలను స్టేట్ పోస్టుల పేరుతో స్థానికేతరులు కొల్లగొట్టారు. ఈ సంప్రదాయాన్ని రాష్ట్ర సర్కారు పూర్తిగా అంతం చేసింది. దీంట్లో భాగంగానే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేసింది. స్థానిక కోటా నిర్వచనాన్ని సైతం మార్చింది. గతంలో 4-10 తరగతుల్లో ఏవేని నాలుగేండ్లు ఒకే జిల్లాలో చదివితే స్థానికులు కాగా, తాజా మార్పులతో 1-7 తరగతుల్లో నాలుగేండ్లు చదివిన జిల్లాలో స్థానికులుగా మార్పు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా క్యాడర్లు, ఉద్యోగుల కేటాయింపు కోసం జీవో-317 జారీ చేసింది. ముల్కీ రూల్స్ నుంచి జీవో-317 వరకు గల చరిత్రను ఒక్కసారి తరచిచూస్తే.. తెలంగాణ ఎదుర్కొన్న వివక్ష బయల్పడటమే కాకుండా తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన మార్పు, ముందుచూపు అవగతమవుతుంది.
ముల్కీ నిబంధనలు:
నిజాం సర్కారులో, హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు అమలయ్యాయి. ఈ నిబంధనల ప్రకారం 15 ఏండ్లు నివాసం ఉన్నవారంతా స్థానికులే. ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేవి. 1952లో స్థానికేతరులు ఉద్యోగాలను కొల్లగొట్టడంతో హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. గైర్ ముల్కీ గో బ్యాక్. నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదంతో విద్యార్థులు ఉద్యమించారు. వరంగల్, హైదరాబాద్ సిటీ కాలేజీలో విద్యార్థులు ఉద్యమం చేశారు. సిటీ కాలేజీ సమీపంలో పోలీసుల కాల్పుల్లో నలుగురు విద్యార్థులు అమరులయ్యారు. తదనంతరం ఏపీలో విలీనం తర్వాత ఈ నిబంధనలు అమలుకాలేదు. దీంతోనే 1969 తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు:
ఉద్యోగాలో స్థానిక కోటా అమలుకోసమే 317 డీ అమల్లోకి వచ్చింది. ఏపీకి మాత్రమే వర్తించేలా 1973లో కేంద్రం 32వ రాజ్యాంగ సవరణ చేసింది. విద్య, ఉపాధి అవకాశాల్లో స్థానికుల హక్కులను పరిరక్షిచేందుకుగాను ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల అమలులోభాగంగానే రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఏర్పడగా, తెలంగాణలో రెండు జోన్లు ఏర్పాటయ్యాయి. ఈ ఆర్డర్ ప్రకారం స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం అమలుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొన్ని పోస్టుల్లో 70:30 లోకల్, నాన్ లోకల్ కోటాను వర్తింపజేశారు.
610 జీవో:
1985లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదిపై నిర్మిస్తున్న తెలుగుగంగ ప్రాజెక్ట్లో అంతా ఏపీ వారిని నియమించడం, తమకు ఉద్యోగాలు దక్కకపోవడంతో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. జోన్-4లోని పోస్టులను ఏపీ వారే ఎగరేసుకుపోవడంతో పాటు, 5, 6 జోన్లలో స్థానికేతరులు ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవడంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా జీవో-610 అమల్లోకి తీసుకొచ్చారు. ఈ జీవో అమలుకు 1985లోనే గిర్గ్లానీ కమిషన్ను ఏర్పాటుచేసినా, ఈ జీవోను సరిగ్గా అమలు చేయలేదు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించలేదు.
జీవో-317:
1975 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏపీ, తెలంగాణలో అమలవుతాయని ఏపీ పునర్విభజన చట్టం-2014 సెక్షన్ 97 పేర్కొన్నది. 371-డీ ఆర్టికల్ స్ఫూర్తిని కొనసాగింపుగా స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని, అసమానతలను రూపుమాపాలన్న భావనతోనే సర్కారు తెలంగాణలో కొత్త జోన్లు, మల్టీజోన్లు, జిల్లాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2 మల్టీ జోన్లు, 7 జోన్లు, 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. 10 జిల్లాలు, 2 జోన్లుగా ఉన్న తెలంగాణ భౌగోళిక స్వరూపం మారడంతో ప్రభుత్వం క్యాడర్ల పునర్వవస్థీకరణను చేపట్టింది. అంతేకాకుండా జీవో-317ను తీసుకొచ్చి ఉద్యోగుల కేటాయింపును పూర్తిచేసింది. దీంతోనే ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. ఆయా ఖాళీల వివరాల ప్రకారమే ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసింది.
స్థానిక యువతకు 95 శాతం ఘనత కేసీఆర్దే
95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే దక్కేలా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ మరోమారు నిరూపించారు. నూతన నియామకాల భర్తీతో ఉద్యోగులపైనా పనిభారం తగ్గుతుంది. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సీఎం కేసీఆర్గారు నిరుద్యోగ యువతకు పదేండ్ల వయోపరిమితి పెంచినందుకు టీఎన్జీవోల కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. 317 జీవోను అవహేళన చేసిన వారందరికీ ఈ ప్రకటన చెంపపెట్టులాంటిది.
– ఎం రాజేందర్, టీఎన్జీవోఎస్,
రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి
నిరుద్యోగులకు బంగారు అవకాశం
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలవుతున్నది. నిరుద్యోగులు ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80,039 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడంపై తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులుగా, తెలంగాణ గెజిటెడ్ అధికారులుగా చాలా గర్వపడుతున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే.
– వీ మమత, టీజీవో అధ్యక్షురాలు
స్థానిక రిజర్వేషన్లు అద్భుత నిర్ణయం
దేశంలో తొలిసారిగా స్థానిక రిజర్వేషన్ల పేరిట 95 శాతం ఉద్యోగాలు ఇవ్వటం అద్భుతమైన నిర్ణయం. ఉద్యోగాల క్యాలెండర్ ప్రతియేటా ప్రకటిస్తామని చెప్పి నూతన పరిపాలనా సంసరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న సందర్భంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏడు వేల కోట్ల ఆర్థిక భారాన్ని లెకచేయకుండా నిర్ణయం ప్రకటించడం సాహసోపేతమైన చర్య. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు.
– దేవిప్రసాద్, తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు
ఉద్యోగ నియమాక ప్రకటన చారిత్రాత్మకం
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చారిత్రాత్మకం. ఏకకాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం భారత దేశ చరిత్రలో మొదటిసారి. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురవుతున్న తెలంగాణ సమాజాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపారు. ప్రజల వద్దకు పాలనలోభాగంగా 33 జిల్లాలను ఏర్పరచి స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు కేటాయించటం దేశ చరిత్రలోనే మొదటిసారి.
– చెన్నయ్య, పీఆర్టీయూ అధ్యక్షుడు
ఇంత భారీ నోటిఫికేషన్ ఎన్నడు రాలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంత భారీ నోటిఫికేషన్ వెలువడలేదు. భారీ సంఖ్యలో ఖాళీల భర్తీ ప్రకటన చేసినందుకు సీఎం కేసీఆర్కు తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం తరఫున కృతజ్ఞతలు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలపై సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం.
– మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, హన్మంత్నాయక్,
తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు. తెలంగాణ సాధనలో ముఖ్యమైన నినాదాలైన నీళ్లు, నిధు లు,నియామకాలలో సీఎం కేసీఆర్ ఈ ఉద్యోగ ప్రకటనతో మూడో నినాదాన్ని పూర్తి చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషం. – ఏ పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్
వయో పరిమితి పెంపు హర్షణీయం
లక్షలాది మంది నిరుద్యోగుల వయోపరిమితి పెంపు విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. భారీ ఉద్యోగ ప్రకటనపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అత్యధిక ఉద్యోగులను విద్యాశాఖలో భర్తీ చేస్తున్నారు. ఆ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
– అయినేని సంతోష్కుమార్, టీఎస్ టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాం
రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యావంతులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) తరఫున స్వాగతిస్తున్నాం. 11,142 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించటం హర్షణీయం.
– కె జంగయ్య, చావ రవి, టీఎస్ యూటీఎఫ్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు రుణపడి ఉంటాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల ప్రకటన జారీ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
– గాదె వెంకన్న, ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హర్షణీయం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. 20 ఏండ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు విధానానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉద్యమిస్తూనే ఉన్నాం.
-డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, జీవో 16 కాంట్రాక్టు ఉద్యోగుల
క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్
సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు
21 ఏండ్ల బానిస సంకెళ్లను బద్దలు కొడుతూ క్రమబద్ధీకరణ హామీని నెరవేర్చబోతున్న సీఎం కేసీఆర్కు యావత్ కాంట్రాక్ట్ లెక్చరర్ల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సీఎం కేసీఆర్కు కాంట్రాక్టు అధ్యాపకులంతా జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేయాలని కోరుతున్నాను. – సీహెచ్ కనకచంద్రం, జేఏసీ చైర్మన్,
తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ (జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్)
సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం
నూతన జోనల్ విధానాన్ని రూపొందించి దానికి అనుగుణంగా 80,039 ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతులు చేపడతామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం.
– కావలి అశోక్ కుమార్, కటకం రమేశ్, టీఆర్టీఎఫ్
నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అమలుచేయాలి
భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఉద్యోగాల నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలి. మా సంఘం తరపున ప్రభుత్వానికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాం.
– ఏ బాలరాజ్, బీ లక్ష్మణ్, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయ సంఘం
నిరుద్యోగ బంధువు కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించి సీఎం కేసీఆర్ నిరుద్యోగ బంధువు అనిపించుకొన్నారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల ప్రకటన ఒక రికార్డు. గ్రూప్ 1 సహా వివిధ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ యువత తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశంలో నిరుద్యోగ సమస్య తీరాలంటే భావి ప్రధాని కేసీఆర్ కావాలని కోరుకుంటున్నా.
– మ్యాన జ్యోత్స్న, గ్రూప్-1 ఆశావహ అభ్యర్థిని
క్రమబద్ధీకరణను స్వాగతిస్తున్నాం..
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇంటర్మీడియట్ వ్యవస్థలో పరాయి ప్రభుత్వాల పాలనలో జరిగిన శ్రమ దోపిడీకి స్వరాష్ట్రంలో చరమ గీతం పాడిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుంది.
– దామెర ప్రభాకర్, దార్ల భాసర్,
తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్