హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వెంటనే కులగణన నిర్వహించాలని, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేయడంతోపాటు బీసీ కులగణన తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహిస్తామని రాహుల్గాంధీ స్పష్టంగా చెప్పడంతోపాటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే హామీని ఇచ్చిందని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. ఈ అంశంపై ఇటీవల రాహుల్ గాంధీని కలిసి వివరించామని, అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం 15 రోజుల్లో ముగియనున్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తున్నదని జాజుల పేర్కొంటూ.. బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఆ ఎన్నికలు నిర్వహించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.