హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పోలీస్ సిబ్బంది ఇంటి నిర్మాణానికి, స్థలం కొనుగోలుకు ఇచ్చే రుణాల పరిమితిని హోదా ను బట్టి రూ.70 లక్షల వరకు పెంచారు. 6.5% వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఆరోగ్యభద్రత ట్రస్ట్ బోర్డు సమావేశం మంగళవారం నిర్ణయం తీసుకున్నది. డీజీపీ మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇల్లు, స్థలం కొనుగోలుకు వడ్డీరేటు 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు. విదేశాల్లో చదివే పిల్లలకు విద్యారుణాన్ని అన్ని హోదాలవారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఇల్లు కట్టుకునేందుకు ఇచ్చే రుణంలో ఏఎస్సై నుంచి కిందిస్థాయి వరకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలకు పరిమితి పెంచారు. ఎస్సై, సీఐ స్థాయివారికి రూ.45 నుంచి రూ.50 లక్షలు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ వరకు రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలకు, ఐపీఎస్ అధికారులకు రూ. 65 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచారు. స్థలం కొనుగోలు రుణం.. ఏఎస్సై నుంచి కిందిస్థాయి వరకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు, ఎస్సై, సీఐ స్థాయికి రూ.25 నుంచి రూ.30 లక్షలకు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీకి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలకు, ఐపీఎస్ అధికారులకు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెంచారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొన్నందుకు డీజీపీ మహేందర్రెడ్డి, వెల్ఫేర్ అడిషనల్ ఉమేశ్ష్రాఫ్లకు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తరఫున అధ్యక్షుడు వై గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.