నిజామాబాద్ క్రైం, జనవరి 26 : నిజామాబాద్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెద్దకాసుల శ్రీశైలం (52) కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. హనుమకొండకు చెందిన శ్రీశైలం గత ఏడాది బదిలీపై నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ‘అందరూ బాగుండండి. ఈ రోజు నా చివరి రోజు’ అనడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ‘ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?’ అని కుమారుడు అడగ్గా ఆఫీస్లో ఉన్నట్టు చెప్పాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన బయల్దేరి నిజామాబాద్ సారంగపూర్లోని ఆయన ఆఫీస్కు అర్ధరాత్రి 1.40 గంటలకు చేరుకున్నారు. ఎంత పిలిచినా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో వారు ఆఫీస్ డోర్ ధ్వంసం చేసి లోనికి వెళ్లి చూడగా శ్రీశైలం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆయన్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ దొరికింది.