కొండాపూర్, ఫిబ్రవరి 26: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఐరోపా దేశమైన లిథువేనియా కాన్సులేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఆ దేశ ఆర్థిక, ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జమైటిస్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల లిథువేనియా గౌరవ కాన్సులేట్గా నియమితులైన దివీస్ ల్యాబ్స్ సీఈవో కిరణ్ సశ్చంద్ర దివితో కలిసి ప్రారంభించారు. కరోలిస్ జమైటిస్ మాట్లాడుతూ ఢిల్లీలో ఇప్పటికే లిథువేనియా రాయబార కార్యాలయం ఉండగా.. ముంబై, కోల్కతా, బెంగళూరులో కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలుగు రాష్ర్టాల్లో రాయబార కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్లో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్లో సైతం నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఇక్కడ నివసిస్తున్న తమ దేశ పౌరులకు అవసరమైన సేవలను అందించడంతోపాటు భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చేందుకు వీలుగా లిథువేనియాలోని విల్పియస్లో ఈ ఏడాది భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివీస్ ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కే దివి, లిథువేనియా ప్రతినిధులు, తెలుగు రాష్ర్టాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.