Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ మంగళవారం విచారణ చేపట్టనున్నారు. పిటిషన్లో కవిత బెయిల్తో పాటు అరెస్టు, డిమాండ్ను సైతం సవాల్ చేశారు. కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయన్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు విచారణ జరిపే అవకాశం ఉన్నది.
కవిత తరఫు న్యాయవాది పలు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంలో పెండింగ్లో ఉండడంతో విచారణ ముందుకు సాగడం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని పేర్కొన్నారు. తాము ఇచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని అందులో స్పష్టం చేశారన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41 (ఏ) ప్రకారం సమన్లు జారీ చేశారని న్యాయవాది విక్రమ్ చౌదరి పేర్కొన్నారు. సీఆర్పీసీ 161 ప్రకారం.. నోటీసులు ఇచ్చారని.. ఆ తర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియదని.. సుప్రీంలో విచారణ సమయంలోనే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందన్నారు.
అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిందన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసిందని.. ఆ పిటిషన్ను న్యాయస్థానం అంగీకరించిందని.. కానీ, దీని గురించి కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదన్నారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందని పేర్కొంది. పిటిషన్లపై మంగళవారం కౌంటర్ వాదనలను వినిపించనున్నట్లు న్యాయస్థానానికి ఈడీ చెప్పింది.