అమీర్పేట్, మార్చి 23: నిబంధనలకు లోబడి కొనసాగుతున్న కల్లు గీత సొసైటీ దుకాణాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్న లిక్కర్ మాఫియా తమపై పోలీసులను ప్రయోగిస్తున్నదని గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్రావుగౌడ్ విమర్శించారు. వృత్తిదారులపై పోలీసుల దాడులను వ్యతిరేకిస్తూ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని శనివారం హైదరాబాద్లోని హోటల్ హరిత ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాలపై పోలీసుల దాడులను వెంటనే నిలిపివేయాలని, బైండోవర్ పేరుతో బెదిరింపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడల అభివృద్ధి కోసం కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్గౌడ్, ఉపాధ్యక్షుడు సంతోష్గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధగౌడ్, నగర అధ్యక్షుడు దేవేందర్గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ముఖేష్గౌడ్తోపాటు 33 జిల్లాల నుంచి వచ్చిన సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.