హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికలకు హైకోర్టు అనుమతించింది. ఎన్నికలను నిలిపివేస్తూ మంగళవారం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను బుధవారం రద్దుచేసింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి స్వేచ్ఛగా తిరిగేలా రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. యాదగిరి సెల్ఫోన్, ఎన్నిక సర్టిఫికెట్ అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. మాజీ ఎమ్మెల్యే, అతని కుమారుడిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, రాష్ట్ర యంత్రాంగం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించలేదన్న వాదనల వ్యవహారం ఈ పిటిషన్ పరిధిలోకి రావని తెలిపింది. కౌన్సిలర్గా ఎన్నికైన తన తండ్రి యాదగిరి కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదంటూ ఆయన కొడుకు ఆకుల హరికాంత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ యాదగిరిని కోర్టు నియమించిన అమికస్ క్యూరీ ఇంటి వద్ద హాజరుపరిచామని చెప్పారు. యాదగిరి తన స్టేట్మెంట్లో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వేధించారని, ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలకు బలవంతంగా కారులో తరలించారని చెప్పారని తెలిపారు. ఈ నెల 13న చీరాలకు యాదగిరి కుమారుడు వచ్చినప్పటికీ కలుసుకునే అవకాశం ఇవ్వలేదని చెప్పారు.
యాదగిరిది నాటకం
సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపిస్తూ, కౌన్సిల్లో 24 మంది సభ్యులుండగా బీఆర్ఎస్ తరఫున 13 మంది గెలిచారని, బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరిలో ఒకరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఒకరు చైర్మన్ ఎన్నికకు ఓట్లు చేశారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యాదగిరి లేకపోయినా బీఆర్ఎస్కు ఇబ్బంది లేదని చెప్పారు. ఎన్నికను జాప్యం చేయడానికే కిడ్నాప్ నాటకానికి తెరతీశారని తెలిపారు. ఇదంతా యాదగిరి ఆడుతున్న నాటకమని అన్నారు. యాదగిరి మున్సిపల్ ఎన్నికలకు హాజరయ్యారని తెలిపారు. అకడున్న పోలీసు ఉన్నతాధికారులకు గానీ, రిటర్నింగ్ అధికారికిగానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. మున్సిపల్ చైర్మన్గా తనకు అవకాశం ఇవ్వలేదన్న కారణంతోనే యాదగిరి బీఆర్ఎస్ నేత, ఆయన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
మంగళవారం దాదాపు నాలుగైదు గంటలపాటు కాంగ్రెస్ నేతలతో పాటు యాదగిరి పోలీసుల వద్దే ఉన్నారని, అప్పుడు కూడా తనను బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఇతరులు కిడ్నాప్ చేశారని ప్రకటించలేదని తెలిపారు. అధికారపార్టీ నేతలు చెప్పినట్టు చేస్తూ కిడ్నాప్ డ్రామా ఆడారని, యాదగిరి చెప్పేదంతా ఒక డ్రామా అని ఆరోపించారు. బీఆర్ఎస్కు 15 మంది కౌన్సిలర్ల బలం ఉందని, మున్సిపాల్టీ అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 అని, ఏ దశలోనూ యాదగిరి ఓటు బీఆర్ఎస్కు అవసరం లేదని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్రెడ్డి స్పందిస్తూ.. ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిందని, కోర్టు ఆదేశాల వల్ల మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఫలితాలను వెల్లడించలేదని చెప్పారు. యాదగిరి స్టేట్మెంట్ను రికార్డు చేసి నివేదిక సమర్పించినట్టు అమికస్క్యూరీ రామకృష్ణారెడ్డి తెలిపారు. వాదనల అనంతరం ధర్మాసనం.. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
లిఫ్ట్ భద్రతకు బిల్లుపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): భవనాల్లో లిఫ్ట్, ఎలివేటర్ల భద్రతపై ఎప్పటిలోగా చట్టం తెస్తారో, దీనికి సంబంధించిన బిల్లు ఏ దశలో ఉందో తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆరు నెలల గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరసరించింది. నాలుగు వారాల్లోగా బిల్లు స్థితిపై నివేదిక అందజేయాలని ఆదేశించింది. చట్టం తెచ్చే వరకు పిటిషనర్ ఇచ్చిన మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. లిఫ్ట్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం నియమనిబంధనలు అమలు చేయని కారణంగా పలుచోట్ల చిన్నారులు, పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ రాజేంద్రనగర్కు చెందిన బరత్అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిటిషన్గా పరిగణించి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేస్తూ చీఫ్జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. బరత్ అలీఖాన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం చట్టాన్ని రూపొందించే వరకు లిఫ్ట్లు, ఎలివేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రజాభద్రతను పరిగణనలోకి తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కోర్టు ఆదేశించిన మేరకు సమగ్ర మార్గదర్శకాలను జనవరి 19న సమర్పించినట్టు చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ముసాయిదా చట్టం సిద్ధంగా ఉందని, ఆరు నెలల గడువు ఇస్తే అది చట్టంగా రూపుదాలుస్తుందని చెప్పారు.
న్యాయవాదుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించండి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2026- 27 వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ లీగల్సెల్ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమారను కలిసి విజ్ఞప్తిచేశారు. అత్యవసర వైద్యం, ఇతరత్రా సమస్యల్లో ఉన్న సుమారు 50 వేల మంది న్యాయవాదుల కుటుంబాలకు చేయూత ఇవ్వాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు న్యాయవాదుల భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి తమ వినతిపై సానుకూలంగా స్పందించారని పొన్నం చెప్పారు.